కమ్యూనిస్టుల గందరగోళం
అణు ఒప్పందంపై ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం సరైందా, కాదా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. వామపక్షాలు కూడా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. బిజెపిని వ్యతిరేకించే సాకుతో కాంగ్రెసును బలపరచడం, అణు ఒప్పందంపై యుపిఎను వ్యతిరేకించి సొంతంగా తృతీయ కూటమి కట్టడం వంటి నిలకడ లేని వైఖరులు ప్రజలను విసిగించాయని చెప్పవచ్చు. ఆ పార్టీలు కట్టిన తృతీయ కూటమి కూటమి కూడా నిలకడ లేని రాజకీయ నాయకులతోనే కావడం మరో పెద్ద పొరపాటు. తాను ప్రధాని కావడం తప్ప మరో ఎజెండా లేని బిఎస్పీ నేత మాయావతితో జత కట్టడం ఆ పార్టీలను పెద్దగా దెబ్బ తీసింది. అంతేకాకుండా, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వివిధ అంశాలపై విధానాలు, వైఖరులు లేని పార్టీలు తృతీయ కూటమిలో చేరాయి. స్పష్టమైన విధానాలున్నాయని చెప్పుకునే కమ్యూనిస్టు పార్టీ ఏ విధానాలు లేని ప్రాంతీయ పార్టీలను చేరదీయడాన్ని కూడా ప్రజలు ఇష్టపడలేదు.
ఇకపోతే, పశ్సిమ బెంగాల్ ప్రభుత్వ విధానాలు, వైఖరులు చూస్తుంటే మిగతా పార్టీలకు కమ్యూనిస్టు పార్టీలకు తేడా లేదనే అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయిందని చెప్పాలి. నందిగ్రామ్, సింగూరు విషయాల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య విధానాలను కూడా బర్దన్ దుయ్యబట్టారు. నందిగ్రామ్, సింగూరు వ్యవహారాల్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణులతో వ్యవహరించిందని చెప్పక తప్పదు. అంతేకాకుండా ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్ ల) విషయంలో మిగతా పార్టీల విధానాలకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి తేడా లేకపోవడాన్ని జాతీయ స్థాయిలో కూడా ప్రజలు గమనించారని అంగీకరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, పశ్చిమ బెంగాల్ లో సిపిఎం వైఖరి దారుణంగా ఉంటుందనేది, ఏకపక్షంగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ పరిస్థితిలో ప్రజలు ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నారు.
జాతీయ స్థాయిలో లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, రాం విలాస్ పాశ్వాన్, మాయావతి, శరద్ పవరా వంటి నేతలు అధికారం కోసం రాజకీయాలు చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల మనస్సుల్లో గాఢంగా నాటుకుపోయింది. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారనేది కూడా వారి అభిప్రాయం. వామపక్షాలు అందుకు భిన్నంగా ఏమీ లేవనే ప్రజలు అనుకున్నారు. అదే సమయంలో బిజెపి హిందూత్వ ఎజెండాకు కాలం చెల్లింది. ముంబై దాడుల తర్వాత ప్రజలు శాంతియుత జీవనాన్ని గాఢంగా కోరుకున్నారు. బిజెపి వల్లనే ముస్లింలు దాడులు చేస్తున్నారనే అభిప్రాయం నెలకొంది. నిజానికి, స్థానిక ముస్లింలకు, హిందువులకు ఎలాంటి విభేదాలు లేవు. మత వైషమ్యాలు లేవు. మతం విషయంలో పరస్పరం గౌరవించుకునే సంప్రదాయం ఉంది. ఈ స్థితిలో కేంద్రంలో ప్రజలు స్థిరమైన లౌకిక ప్రభుత్వాన్ని కోరుకున్నారు. దాని వల్లనే వామపక్షాలతో పాటు మిగతా పార్టీలు ఈ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిన్నాయి.