కెసిఆర్ పులి స్వారీ
తాను ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించడానికి సమాయత్తం కాగానే తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు హోరెత్తాయి. ఆయన అరెస్టును నిరసిస్తూ పెద్ద యెత్తున ఆందోళనలు సాగాయి. ఇది కూడా ఎవరూ ఊహించని పరిణామమే. విద్యార్థుల్లో అంత ఉద్వేగం, తెలంగాణ ఆకాంక్ష ఉందనే విషయం గత తొమ్మిదేళ్ల కాలంలో మొదటి సారి బయటపడింది. ఆయన నిరాహార దీక్ష విరమిస్తున్నట్లు వార్తలు వచ్చిన వెంటనే అదే విద్యార్థులు ఎదురు తిరిగారు. ఆయన శవయాత్రలు కూడా నిర్వహించారు. ఇది ఆయనను ఇరకాటంలో పెట్టింది. ఇక్కడే తాను అనుకున్నట్లుగా కెసిఆర్ చేయలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన తిరిగి నిరాహార దీక్షను చేపట్టాల్సిన అనివార్యతలో పడ్డారు. ఇది ఆయన వ్యక్తిత్వానికి సరిపడని విషయమని అంటున్నారు.
తెలంగాణ ఉద్యమం విషయంలో కెసిఆర్ ఎత్తుగడలను, వ్యూహాలను, ఆచరణలు ఎప్పటికప్పుడు విమర్శకు పెడుతూనే తనను తెలంగాణ ప్రజలు బలపరుస్తున్నారనే విషయాన్ని ఆయన గమనించినట్లు లేరు. నిజానికి, విద్యార్థులను ఉద్యమానికి దూరంగా పెట్టి తెలంగాణ సాధించాలనే ఆయన లక్ష్యం నెరవేరలేదు. దాంతో అనివార్యంగా విద్యార్థులు రంగం మీదికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు విద్యార్థుల చేతుల్లో కెసిఆర్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఏ పరిస్థితిలో కెసిఆర్ ఉద్యమాన్ని విరమిస్తారనేది, అందుకు ఎలా అనుకూల వాతావరణం ఏర్పడుతుందనేది చెప్పలేని పరిస్థితి.
కాంగ్రెసు అధిష్టానం కూడా కెసిఆర్ చేత దీక్ష విరమింపజేయడానికి తొందరపడుతున్న సూచనలు కనిపించడం లేదు. ఢిల్లీలో అప్పటికప్పుడు కొంత కదలిక వచ్చినప్పటికీ అది కెసిఆర్ కు అనుకూలంగా పరిణమించే అవకాశాలు లేవని అర్థమవుతోంది. ఈ స్థితిలో కెసిఆర్ తన భవిష్యత్తు తాను నిర్ణయించుకోలేని స్థితిలో పడ్డారు. ఇప్పుడు ఆయన అడకత్తెరలో పోక చెక్కలా చిక్కిపోయారనే భావన బలంగా నాటుకుపోయింది. ఇది పులి మీద స్వారీలాగానే ఉంది.