చంద్రబాబుకు షాక్
అనంతపురం జిల్లా ఎమ్మెల్సీగా ఉన్న పల్లె రఘునాథ రెడ్డి పుట్టపర్తి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. అయితే ఎమ్మెల్సీకి జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. తాము ఇక్కడ గట్టి పోటీ ఇవ్వలేకపోయామని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. జడ్పీటిసి, ఎంపిటీసిల ఉప ఎన్నికల్లో ఫలితాలు చాలా చోట్ల ఇదే విధంగా వచ్చాయి. కాంగ్రెసు 11 జడ్పీటిసీలను గెలుచుకోగా, తెలుగుదేశం పార్టీ 4 స్థానాలు మాత్రమే దక్కాయి. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పార్టీ బలంగా ఉన్న చోట్ల కూడా పరాజయం పాలు కావడం తెలుగుదేశం నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. కోస్తాలో తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు కూడా ఏ మాత్రం కోలుకోలేదని ఫలితాలు రుజువు చేస్తున్నాయి.
చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ లు పెట్టి ఉత్సాహపరచడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పార్టీ జిల్లా నాయకత్వాలే కాకుండా సీనియర్ నేతలు కూడా ఏ మాత్రం కృషి చేయలేదని పార్టీ వర్గాలే అంటున్నాయి. శాసనసభ, లోకసభ ఎన్నికల తర్వాత ఏర్పడిన స్తబ్దత పార్టీలో ఇంకా తొలిగిపోయిన జాడలు లేవు. కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీలు బలహీనపడితే తాము లబ్ధి పొందాలని మాత్రమే నాయకులు భావిస్తున్నారు. కానీ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసి, క్యాడర్ ను ఉత్సాహపరిచే చర్యలేవీ తీసుకోవడం లేదు. తాను చెప్పినా నాయకులు కదలకపోవడం చంద్రబాబును కలవరపెడుతున్నట్లు సమాచారం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే ఐదేళ్లనాటికైనా పుంజుకుంటామా లేదా అనే అనుమానం ఆయనను పీడిస్తున్నట్లు తెలుస్తోంది.