అద్వానీ తలకు బొప్పి
జాతీయ కార్యవర్గానికి ఎజెండాను ఖరారు చేసేందుకు శుక్రవారం జరిగిన ఆఫీస్ బియరర్ల సమావేశంలో డ్రామా నడిచింది. అరుణ్ శౌరి రాసిన లేఖను జస్వంత్ సింగ్ సమావేశంలో పంచడానికి ప్రయత్నించారు. దాన్ని ఇతర సీనియర్ నాయకులు అడ్డగించే ప్రయత్నం చేశారు. గత కోర్ గ్రూప్ సమావేశంలో పంచిన లేఖ మీడియాకు ఎలా వెల్లడైందని వినయ్ కతియార్ జస్వంత్ సింగ్ ను ప్రశ్నించారు. తాను ఎవరికీ జవాబుదారీని కానని జస్వంత్ దురుసుగా సమాధానమిచ్చారు. ఫిలిబిత్ లో వరుణ్ గాంధీ ద్వేషపూరిత ప్రసంగంపై పార్టీ మౌనం పాటించడాన్ని ముక్తార్ అబ్బాస్ నక్వీ, మొహమద్ షాహనవాజ్ ప్రశ్నించారు.
చర్చ కోసం యశ్వంత్ సిన్హా, జస్వంత్ సింగ్ లు రాసిన లేఖలను కూడా పంపిణీ చేయాలని అరుణ్ శౌరి కోరారు. ఎల్ కె అద్వానీ, రాజ్ నాథ్ సింగ్ లపై విమర్శలు, ప్రతివిమర్శలతో పార్టీ రెండుగా చీలిపోయింది. రాజ్యసభలో అరుణ్ జైట్లీని ప్రతిపక్ష నాయకుడిగా అద్వానీ అంగీకరించకపోవడంపై, సుష్మా స్వరాజ్ ను లోకసభ డిప్యూటీ డిప్యూటీ నాయకురాలిగా చేయడంపై జస్వంత్ సింగ్, యశ్వంత్ సిన్హా నాయకత్వంపై దండెత్తుతున్నారు. అర్హతను బట్టి ఎంపిక జరగలేదనేది వారి ఆరోపణ.
ఎన్నికల్లో పార్టీ వైఫల్యంపై మీడియాలో పార్టీ నాయకులు బహిరంగంగా మాట్లాడకూడదని రాజ్ నాథ్ సింగ్ ఆదేశించారు. పార్టీ వైఫల్యానికి ఉమ్మడి బాధ్యత వహించాలని అద్వానీ వర్గానికి చెందిన నాయకులు వాదిస్తున్నారు. మరో ఐదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండాల్సి రావడం, గత ఐదేళ్ల పాటు అధికారంలో లేకపోవడం వంటి కారణాల వల్ల పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించే పని కష్టంగానే మారింది. జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ నాయకత్వం అనుసరించే విధానంపై పార్టీ పరిస్థితి ఆధారపడి ఉండవచ్చు. కానీ, ఈ అగ్ని ఇప్పట్లో చల్లారేట్లు లేదు.