అల్లు పెత్తనం: 'చిరు' గోస
రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)తో సహా అన్ని స్థాయిల్లోని కమిటీలను పునర్వ్యవస్థీకరించాలని ప్రజారాజ్యం పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర తనను ఏ కమిటీలోకీ తీసుకోవద్దని స్వయంగా చిరంజీవికే చెప్పినట్లు తెలిసింది. పార్టీకి తన అవసరం ఏ రూపంలో ఉందని భావించినా సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, కమిటీల్లో మాత్రం ఉండబోనని తేల్చిచెప్పినట్లు సమాచారం. మాజీ ఎంపీ కెఎస్ ఆర్ మూర్తి సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలిసింది. మరికొందరు సీనియర్ నేతలు సైతం ఇదే వైఖరితో ఉన్నారని పార్టీ వర్గాల కథనం. ఎన్నికల సమయంలో పీఏసీని పరిగణనలోకి తీసుకోకుండా అభ్యర్థుల ఎంపికసహా ముఖ్యమైన నిర్ణయాలన్నీ జరిగాయన్న భావన పార్టీవర్గాల్లో ఉంది. దీనిపై కొందరు సీనియర్లలో అసంతృప్తి గూడు కట్టుకుంది. కీలక సమయంలో తమను విస్మరించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాను పార్టీ నుంచి వెళ్లిపోతున్నట్లు మిత్రా ఇప్పటికే చిరంజీవికి చెప్పినట్లు తెలుస్తోంది.
శివశంకర్, హరిరామ జోగయ్య లాంటి సీనియర్లు కూడా నామమాత్రంగా రాజకీయ వ్యవహారాల కమిటీలో ఉండడాన్ని ఇష్టపడడం లేదని తెలుస్తోంది. రాజకీయ వ్యవహారాల కమిటీని సంప్రదించకుండానే ఎన్నికల్లో అన్ని నిర్ణయాలూ జరిగినప్పుడు దానిలో ఉండి కూడా ప్రయోజనం లేదనే భావనకు వారు గురైనట్లు చెబుతున్నారు. అల్లు అరవింద్ నిర్ణయమే తమ నిర్ణయంగా చెలామణి కావడాన్ని కూడా వారు జీర్థించుకోలేకపోతున్నారు. ఎన్నికలపై విశ్లేషణలు కూడా నామమాత్రంగానే జరిగాయని వారు భావిస్తున్నట్లు సమాచారం. వీరికి తోడు, సీనియర్ నేతలు టి. దేవేందర్ గౌడ్, తమ్మినేని సీతారాం కూడా తమ మార్గాలను వెతుక్కుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
చిరంజీవి ఎంతగా చెబుతున్నప్పటికీ ఆయన సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ పార్టీలో చురుకైన పాత్ర పోషించే పరిస్థితిలేదని చెబుతున్నారు. దీనికంతటికీ కారణం అల్లు అరవిందేనని, అల్లు అరవింద్ నిర్ణయాలే ఆచరణలోకి వచ్చినప్పుడు కమిటీలు, నిర్ణయాలు వంటి వాటికి అర్థం లేదని వారు భావిస్తున్నట్లు సమాచారం.చిరంజీవి అల్లు అరవింద్ నిర్ణయాలకు తప్ప మరో అభిప్రాయానికి తావు ఇవ్వడం లేదనే విమర్శ కూడా ఉంది.