వైయస్ 'జగన్మా'య
ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై వైరాగ్యం ప్రకటించారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. తన సాక్షి పత్రిక విశ్వసనీయత పోకూడదని, ఉద్యోగుల సంక్షేమం కోసం తాను ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని చెప్పారు. జగన్ పై అక్రమాల ఆరోపణలు చేస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి వరుసగా వార్తాకథనాలు ప్రచురిస్తున్న సమయంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఆయన తన మనసు మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. పోటీకే మొగ్గు చూపారు. ఆయన ఎన్నికల ప్రచారంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలపై విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై కూడా ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మూడు రోజుల నుంచే ఆయనను గద్దె దించేందుకు ప్రయత్నిస్తున్నారని, గత ఐదేళ్లుగా ఆ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారని ఆయన అంటున్నారు.