చంద్రులపై రాజశేఖర సమరం
ఎన్నికలు ముగిసిన వెంటనే తెలుగుదేశం, తెరాసలపై ఆయన దృష్టి సారించి ఆ పార్టీల నాయకత్వాలను నైతికంగా కూడా దెబ్బ తీసే పనికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు. కాంగ్రెసుకు అవసరమైన చోట ఆ పార్టీలకు చెందిన బలమైన వారిని కాంగ్రెసులోకి తెచ్చే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో కాంగ్రెసులోని తన ప్రత్యర్థి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కోలుకోలేకుండా దెబ్బ తినడంతో తెలుగుదేశం పార్టీకి చెందిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఆయన తన వైపు లాక్కున్నారని అంటున్నారు. కాంగ్రెసులోకి వస్తూ నాయకత్వాన్ని నైతికంగా, భౌతికంగా దెబ్బ తీయాలనే ఎత్తుగడలను కూడా ఆయన అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రసన్నకుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై ప్రసన్నకుమార్ రెడ్డి లేఖల యుద్ధం ప్రకటించారు.
తాజాగా తలసాని శ్రీనివాస యాదవ్ కాంగ్రెసు గూటికి మారే సూచనలు కనిపిస్తున్నాయి. తలసాని శ్రీనివాస యాదవ్ వ్యవహారం మాత్రం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సాగుతున్నట్లు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవికి తలసానిని కాంగ్రెసు నిలబెట్టవచ్చుననే ప్రచారం సాగుతోంది. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు గణనీయంగా ఉండడంతో తెలంగాణవాదానికి వ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో తలసాని తెలుగుదేశం పార్టీ తెలంగాణ వైఖరిని తప్పు పడుతూ బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాగే మరికొంత మందిని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి లాగేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగతంగా కూడా కక్ష పెంచుకున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో తెరాస వైఫల్యం వైయస్ కు కలిసి వచ్చింది. దీంతో కెసిఆర్ పై అన్ని వైపుల నుంచి దాడి మొదలైంది. కెసిఆర్ ను నైతికంగా దెబ్బ తీసి తెలంగాణ వారిచేతనే ఛీకొట్టించే ఎత్తుగడను రాజశేఖర రెడ్డి ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా తెరాస అసమ్మతి వాదులు చంద్రశేఖర రావుపై విమర్శనాస్త్తాల జడివానను కురిపిస్తూ వస్తున్నారు. కెసిఆర్ పై విమర్శలు చేస్తున్నవారిలో ఎ చంద్రశేఖర్, రవీంద్రనాయక్, రెహ్మాన్ లు కావడం ఇక్కడ గమనార్హం. దళిత, గిరిజన, ముస్లిం వర్గాలకు చెందిన ఈ నాయకులు ముందుండడం వల్ల ప్రతి విమర్సలు చేసే విషయంలో కెసిఆర్ నోరు కట్టేసినట్లయింది. అగ్ర కులానికి చెందిన కెసిఆర్ ఏ మాత్రం నోరు జారినా అన్ని వైపుల నుంచి దాడిని ఎదుర్కునే ప్రమాదం ఉంది. దీన్ని కెసిఆర్ ఒక రకంగా అధిగమించారనే చెప్పాలి.
కెసిఆర్ పై దారుణంగా దాడి చేస్తున్న కెకె మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డిలు ఇప్పటికే కాంగ్రెసులోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. కెకె మహేందర్ రెడ్డి కెసిఆర్ కుమారుడు కెటి రామారావుపై తెరాస తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికల్లో కొన్ని వందల ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు. భువనగిరి శాసనసభా నియోజకవర్గంలో జిట్టా బాలకృష్ణారెడ్డికి విశేషమైన బలం ఉంది. దీంతో వారిద్దరిని వైయస్ రాజశేఖర రెడ్డి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
మొత్తంగా గత ఎన్నికల్లో కాంగ్రెసు ఓడిపోయిన 70 శాసనసభా నియోజకవర్గాలను ప్రధానంగా ఎంచుకుని వాటిపై రాజశేఖర రెడ్డి ఇప్పటి నుంచే దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓడిపోయిన అభ్యర్థులను తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెరాసకు చెందిన ఎక్కువ మందిపై ఆయన దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. రవీంద్రనాయక్, చంద్రశేఖర్, రెహ్మాన్ వంటి తెరాస అసమ్మతి నాయకులు అసలైన తెరాస తమదే అని చెబుతున్నప్పటికీ వారంతా కాంగ్రెసు వైపు చూస్తున్నట్లు, అందులో భాగంగానే తెరాసను, తెరాస నేతను బలహీన పరిచే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
వచ్చే ఐదేళ్లలో వైయస్ రాజశేఖర రెడ్డి ధాటిని తట్టుకోవడం చంద్రబాబుకు, చంద్రశేఖర రావుకు అంత సులభమేమీ కాకపోవచ్చు.