మళ్లీ అల్లు అరవింద్ హవా
మళ్లీ ఆయన ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించడానికి ముందుకు వచ్చారు. ఆయన ప్రజారాజ్యం పార్టీ ప్రధాన కార్యదర్సిగా నియమితులయ్యారు. తద్వారా పార్టీలో సర్వాధికారాలు ఆయనకే ఉంటాయి. అల్లు అరవింద్ ను ఇష్టపడని నాయకులంతా దాదాపుగా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు పార్టీలో అల్లు అరవింద్ మాటే అందరి మాటగా చెలామణి అయ్యే అవకాశం ఉంది. తాను ప్రజారాజ్యం పార్టీలో తిరిగి క్రియాశీలక పాత్ర పోషించనున్నట్లు చాలా రోజుల క్రితమే అల్లు అరవింద్ చెప్పారు.
ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసుకు దగ్గర కావడంలో అల్లు అరవింద్ పాత్ర ఉందని అంటున్నారు. ఆ వైఖరి వల్లనే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోయిందని అభిప్రాయం ఉంది. అలా ఎదగాల్సిన అవసరం పార్టీకి లేదని కూడా అల్లు అరవింద్ భావించి ఉంటారని అంటారు. తెలుగుదేశం పార్టీని దెబ్బ తీసి, కాంగ్రెసుకు లాభం చేకూరే విధంగా పార్టీని తయారు చేసి పెట్టారనే విమర్శ కూడా ఉంది.
ప్రధాన కార్యదర్శిగా అల్లు అరవింద్ ప్రజారాజ్యం పార్టీని కచ్చితంగా కాంగ్రెసు వైపు నడిపిస్తారనేది కచ్చితమైన అభిప్రాయంగానే వ్యక్తమవుతోంది. అందువల్ల భవిష్యత్తులో ప్రజారాజ్యం కాంగ్రెసులో విలీనమైనా ఆశ్చర్యం లేదనే మాట వినిపిస్తోంది.