వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్లు అరవింద్ వర్సెస్ ఆంధ్రజ్యోతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Allu Aravind
ప్రజారాజ్యం పార్టీ నాయకుడు, సినీ నిర్మాత అల్లు అరవింద్, ఆంధ్రజ్యోతి దినపత్రిక మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. అల్లు అరవింద్ ఆలయ భూములను అక్రమంగా కొన్నారని ఆంధ్రజ్యోతి ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. దాన్ని ఖండిస్తూ ప్రజారాజ్యం నేత అల్లు అరవింద్ ఆంధ్రజ్యోతి మీద మండిపడ్డారు. ఆ వార్తాకథనం ప్రసారం చేసిన 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి'పై కూడు విరుచుకుపడ్డారు. అల్లు అరవింద్ వ్యాఖ్యలను ఉదహరిస్తూ తాను అక్రమంగా భూమి కొనుగోలు చేయలేదని నిరూపించుకోవడానికి బదులు ఆంధ్రజ్యోతిపై దుమ్మెత్తిపోశారని మరో వార్తాకథనాన్ని ప్రచురించింది. అల్లు కుటుంబ సభ్యులు కృష్ణా జిల్లా నూజివీడులోని శ్రీవెంకటాచలపతి ఆలయ భూములను అక్రమంగా కొన్నట్లు 'ఆంధ్రజ్యోతి' వార్తాకథానాన్ని ప్రచురించింది. దీనిపై అల్లు ఆదివారం విలేఖరులతో మాట్లాడారు. ఆయన వెంట పార్టీ నేతలు సి.రామచంద్రయ్య, కోటగిరి విద్యాధరరావు కూడా ఉన్నారు.

తాము కొన్నవి నూటికి నూరుపాళ్లు దేవాలయ భూములు కావన్నారు. తాను ఆగస్టులో తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని తెలుసుకుని తనపై మొదటి అస్త్రం సంధించారన్నారు. పార్టీపై బురద చల్లడానికి 'ఆంధ్రజ్యోతి' తనపైన వ్యక్తిగత ఆరోపణలు చేసిందని అన్నారు. భూములు అమ్ముకోవడానికి నిరభ్యంతర పత్రం అడిగిన మాట వాస్తవమని అంగీకరిస్తూనే కథనంలో పేర్కొన్న పత్రాలు మాత్రం అందులో లేవని ఆంధ్రజ్యోతి రాసింది. "మా అమ్మ, నా భార్య పేరిట 22 ఏళ్ల కిందట భూములు కొన్న మాట నిజం. లింక్ డాక్యుమెంట్లు చూసుకుని, మిరియాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి దగ్గర భూములు కొన్నాం. ఆయన అప్పటికి 22 సంవత్సరాల కిందట కాళహస్తి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి దగ్గర వీటిని కొన్నారు. 1990 నాటికే పార్టీ స్థాపిస్తామని కలలు కని, ఇదంతా చేసినట్లు కథనం రాశారు. అడంగళ్, పట్టా పాసు పుస్తకంలో యజమాని, కౌలుదారు కాలమ్స్ ఉంటాయి. యజమాని కాలం కిందే ఈ పట్టా భూములున్నాయి. ప్రభుత్వ, దేవాలయ భూములైతే ఇలా ఉండవు" అని అల్లు అరవింద్ అన్నారు. కోర్టు తీర్పులోని 338 ఎకరాల భూమి సర్వే నెంబర్లలో తమ భూముల నెంబర్లు లేవని తెలిపారు. "దీనికి అల్లు గారి గిల్లుడు అని హెడ్డింగ్ పెట్టి కథనం రాశారు. చానల్‌ లో గంటపాటు చర్చ పెట్టారు. దీన్ని ఎల్లో జర్నలిజం అనాలా! ఇంకేమనాలి? ఒక పార్టీకి కొమ్ముకాస్తున్నారు" అంటూ ఆయన రెచ్చిపోయారు. ప్రజారాజ్యం అధికారంలోకి రాకపోయి ఉండొచ్చని... కానీ, ఒక పార్టీని అధికారంలోకి రాకుండా చేసిందని అన్నారు.

అల్లు అరవింద్ తమపై మండిపడిన నేపథ్యంలో వీటికి బదులేది అంటూ ఆంధ్రజ్యోతి కొన్ని ప్రశ్నలు సంధించింది. ఆ ప్రశ్నలు యథాథంగా-
* 'అవి ఆలయ భూములు కావు' అని అల్లు అరవింద్ ఘంటాపథంగా చెబుతున్నారు. అలాంటప్పుడు...ఆ భూములను విక్రయించుకోవడానికి నిరభ్యంతర పత్రం ఇవ్వాల్సిందిగా 2009 నవంబర్ 18న అప్పటి ఆలయ కార్యనిర్వహణాధికారిని ఎందుకు కోరినట్లు? * భూములకు సంబంధించిన పత్రాలన్నీ మీడియాకు ఇస్తామని అల్లు అరవింద్ స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత కోర్టు తీర్పు ప్రతి, పాస్ ‌పుస్తకాలు మాత్రమే ఇచ్చారు. అది కూడా..విలేఖరులు అడిగిన తర్వాతే! లింక్ డాక్యుమెంట్లు ఎందుకు ఇవ్వలేదు? * 'అవి అక్షరాలా ఆలయ భూములే. అన్నీ తెలిసే కొన్నారు. ఒకవేళ తెలియకుండా కొన్నా...తర్వాత వాటిని ప్రభుత్వానికి అప్పగించాలి. అంతేగానీ, ఇంకొకరికి అమ్ముకోవడానికి అనుమతి కోరడం తప్పు. వాళ్లు కొన్నది 24 ఎకరాలే అయినా...వారి కబ్జాలో 60 ఎకరాల వరకు ఉన్నాయి. ఎన్‌వోసీ ఇవ్వాల్సిందిగా అల్లు అరవింద్ నన్ను స్వయంగా కోరారు. తర్వాత పీఆర్పీ నేతలు స్వామినాయుడు, వేమూరి చంటి అనే వ్యక్తులు నా వద్దకు వచ్చారు. తమకు సహకరిస్తే పార్టీ అధికారంలోకి వచ్చాక అసిస్టెంట్ కమిషనర్‌ను చేస్తామన్నారు" అని అప్పటి ఆలయ కార్యనిర్వహణాధికారి రవికుమార్ స్పష్టం చేశారు. ఇవన్నీ అవాస్తవాలా? అల్లు అరవింద్ 'రీ ఎంట్రీ'ని అడ్డుకునేందుకే ఆ అధికారి ఇలా చెప్పాడంటారా? * సర్వీసు రిజిస్టరు నెంబర్ 38 అంటే దేవాదాయ శాఖకు సంబంధించి బైబిల్‌తో సమానం. ఆ రిజిస్టర్‌లో ఆలయ భూముల వివరాలన్నీ నమోదై ఉంటాయి. వెంకటాచల స్వామికి చెందిన 338 ఎకరాలు కూడా ఈ రిజిస్టరులో నమోదై ఉన్నాయి. అల్లు అరవింద్ కొన్న భూములు కూడా ఇందులోవే అని ఈవో రవికుమార్ స్పష్టం చేస్తున్నారు. దీనిపై ఏమంటారు?

మొత్తం మీద, అల్లు అరవింద్ ను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రజ్యోతి సంధించిన వార్తాకథనం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X