గద్దర్ పై ఆంధ్రజ్యోతి మక్కువ?
కెసిఆర్ ను అహంభావిగా ఆంధ్రజ్యోతి - ఎబిఎన్ చానెల్ వ్యాఖ్యానించింది. కెసిఆర్ ఒంటెత్తు పోకడలు నష్టం కలిగించేవిగా ఉన్నాయని కూడా చెప్పింది. సీమాంధ్రులను కెసిఆర్ భయపెడుతున్నారని చెప్పింది. అందుకు ప్రతిగా గద్దర్ చేయాల్సిన పనేమిటో కూడా సలహాలు ఇచ్చింది. సీమాంధ్రుల మద్దతు కూడగట్టాల్సిన అవసరం గద్దర్ కు ఉందని సూచించింది. అది అంత సులభం కాదని, అది గద్దర్ కు సవాల్ అని వ్యాఖ్యానించింది. తెలంగాణలోని సీమాంధ్ర ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత గద్దర్ కు ఉందని చెప్పింది. కెసిఆర్ ను ఎదుర్కోవాలంటే అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుందని గద్దర్ కు సూచించింది. కెసిఆర్ వ్యూహాల ముందు జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదమని హెచ్చరించింది. తెలంగాణ ప్రజా ఫ్రంట్ ను తెరాసకు అనుబంధంగా మార్చుకునే తెలివితేటలు కెసిఆర్ కు ఉన్నాయని, ఈ విషయంలో గద్దర్ జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. గద్దర్ పై మావోయిస్టు ముద్ర ఉందని, దాన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది.
గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని కూడా సూచించింది. పదవులు లేకపోతే ఎవరూ వెంట ఉండరనే నగ్న సత్యాన్ని విడమరిచి చెప్పింది. అందుకు ప్రజా ఫ్రంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని అభిప్రాయపడింది. గద్దర్ పై ఆంధ్రజ్యోతి యాజమాన్యం అంత మక్కువ చూపడానికి, కెసిఆర్ పై దుమ్మెత్తి పోయడానికి గల కారణాలపై విశ్లేషించాల్సిన అవసరం లేదని, అందులోని ఆంతర్యమేమిటో వెంటనే అర్థమైపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగానే సీమాంధ్ర మీడియా గద్దర్ కు ఆహ్వానం పలుకుతోంది. అలా పలకడాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏమీ లేదు గానీ దాన్ని ఆంతర్యంపైనే తెలంగాణవాదులకు అనుమానాలున్నాయి.