కాంగ్రెసుతో దోస్తీకి కనిమొళి పొగ
కనిమొళికి చెందిన ప్రభుత్వేతర సంస్థ తమిళ మయ్యం కార్యాలయంపై సిబిఐ అధికారులు బుధవారం దాడులు చేశారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణానికి చెందిన డబ్బులు ఈ ఎన్జీవో ద్వారా విదేశాలకు వెళ్లి మరో రూపంలో దేశంలోకి వస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిబిఐ కనిమొళికి చెందిన కార్యాలయంలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. దీనిపై డిఎంకె వర్గాలు కాంగ్రెసుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి.
డిఎంకెతో సంబంధాలు చెడిపోకుండా కాంగ్రెసు నష్టనివారణ చర్యలకు రంగంలోకి దిగింది. డిఎంకె యుపిఎ నుంచి తప్పుకుంటుందనే వార్తలను కాంగ్రెసు కొట్టేస్తోది. డిఎంకె, కాంగ్రెసు పరస్పర విశ్వాసంతో ముందుకు సాగుతున్నాయని, 2జి స్పెక్ట్రమ్ విచారణ పూర్తయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది అన్నారు. 2011లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెసుతో దోస్తీని సమీక్షించేందుకు డిఎంకె అత్యవసర సమావేశం జరిగే అవకాశాలున్నాయి.