కెసిఆర్ కో నీతి, జగన్ కో నీతా?
కెసిఆర్ పట్ల అంత కటువుగా వ్యవహరించిన ప్రభుత్వం వైయస్ జగన్ పట్ల ఎందుకు వ్యవహరించడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. జగన్ ఓదార్పు యాత్రకు ప్రభుత్వ అనుమతి లేదు. జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. జగన్ యాత్రకు ముందు రోజే మహబూబాబాద్ బస్ స్టేషనులో టైంబాంబు లభించింది. తెలంగాణవాదులు జగన్ యాత్రను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఈ ఉద్రిక్త స్థితిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని వాతావరణం ఉంది. పైగా, జగన్ యాత్రను అడ్డుకోవడానికి బదులు ప్రభుత్వం ఆయన యాత్రకు పెద్ద యెత్తున భద్రతా ఏర్పాట్లు చేసింది. జగన్ యాత్రను వ్యతిరేకిస్తున్న తెలంగాణవాదులపై ఉక్కుపాదం మోపుతోంది.
జగన్ యాత్రను ప్రజలు అడ్డుకుంటున్నారే తప్ప ప్రభుత్వం మాత్రం ఏమీ చేయడం లేదు. జగన్ ను అరెస్టు చేయడానికి గానీ, ఆయన యాత్రను నివారించడానికి గానీ ప్రభుత్వం ప్రయత్నించడం లేదు. జగన్ యాత్ర సందర్భంగా ఏమైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగానే మారింది. దానికి కూడా తెలంగాణ ప్రజలనే బలి పశువులను చేయడానికి ఆంధ్ర పక్షపాత ప్రభుత్వం వెనకాడబోదనే మాట వినిపిస్తోంది.