జగన్ కు 'గాలి' దెబ్బ
గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో కాంగ్రెసును చావు దెబ్బ తీసి, బిజెపి కోటగా మార్చారు. అంతకు ముందు బళ్లారి కాంగ్రెసుకు పెట్టని కోట. బిజెపి కర్నాటకలో అధికారంలోకి రావడానికి కూడా మైనింగ్ ద్వారా గాలి జనార్దన్ రెడ్డి సంపాదించిన సొమ్మే ప్రధాన కారణమనే అభిప్రాయం ఉంది. దాంతోనే గాలి జనార్దన్ రెడ్డి కర్నాటక ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి చేరుకున్నారు. బిజెపి అధిష్టానాన్ని కూడా ధిక్కరించే స్థాయికి వెళ్లి కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప మెడలు వంచారు. గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు బిజెపి నాయకత్వానికి సవాల్ గా మారినప్పటికీ భవిష్యత్తులో కాంగ్రెసుకు పెను ప్రమాదాన్ని తెచ్చే పెట్టేట్లుందనే భావన ఏర్పడింది. బళ్లారిలో జరిగిన నష్టం ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగే ప్రమాదం ఉందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యక్తిగతంగా కూడా గాలి సోదరుల మీద ఆగ్రహం ఉంది. తాను పోటీ చేసినప్పుడు తనకు వ్యతిరేకంగా గాలి సోదరులు చక్రం తిప్పే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వారు బిజెపి నేత సుష్మా స్వరాజ్ కు దగ్గరయ్యారు.
గాలి జనార్దన్ రెడ్డి సాయంతో వైయస్ జగన్ రాష్ట్రంలో తమకే ప్రమాదకరంగా పరిమించవచ్చుననేది కాంగ్రెసు అధిష్టానం భావనగా కనిపిస్తోంది. ఇప్పటికే జగన్ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసే చర్యలకు ఒడిగట్టాడు. వైయస్ రాజశేఖర రెడ్డి అనుచరగణం ద్వారా రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పలు మార్లు అధిష్టానానికి అభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరించారు. ఇప్పటికీ జగన్ ఆ ధోరణి మార్చుకోలేదు. జగన్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు తమకు భవిష్యత్తులో గాలి జనార్దన్ రెడ్డి కర్నాటక విషయంలో బిజెపి నాయకత్వానికి సవాల్ విసిరినట్లుగా విసిరే అవకాశాలున్నాయని కాంగ్రెసు అధిష్టానం పసిగట్టింది. అందుకే జగన్ రాజకీయాలను ఆదిలో అణచేయాలని కంకణం కట్టుకుంది. తమ మాట వినకపోతే జగన్ పార్టీ నుంచి వెళ్లిపోయినా ఫరవా లేదనే అభిప్రాయంతో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఈ స్థితిలో జగన్ ఓదార్పు యాత్రకు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతి ఇవ్వకూడదని, జగన్ విషయంలో పట్టు సడలించకూడదని నిర్ణయించుకుంది. బంతిని జగన్ కోర్టులోకి నెట్టింది.