జూ ఎన్టీఆర్ ఇంట గెలుస్తాడా?
జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు ఇప్పుడు ఎవరికీ పరిచయం చేయవలసిన అవసరం లేదు. అయితే పదేళ్ల క్రితం మాత్రం చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి అష్టకష్టాలు పడ్డాడు. అతి చిన్నవయసులోనే స్టార్ గా ఎదిగిన ఓ క్రేజీ స్టార్ జూ.ఎన్టీఆర్. చిత్ర పరిశ్రమకు మొదట్లో వచ్చినప్పుడు ఎవరి అండదండలు లేవు, ఎవరి ఆశిస్సులూ లేవు. ఏ గాడ్ ఫాదర్ లేడు. గాడ్ ఫాదర్ వంటి తండ్రి కూడా దూరంగానే ఉన్నాడు. ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి కుటుంబం నుండి ఎలాంటి ఆసరా లభించలేదు. అయినప్పటికీ ప్రేక్షకులలో ఇంత ఆదరణ, ఇంతమంది అభిమానులను సంపాదించుకొని నందమూరి వంశానికి వారసుడిగా ఎదగడానికి కారణం మాస్ అప్పియరెన్సు, తాత ఎన్టీఆర్ పోలిక, డాన్సు, నందమూరి వంశం. ఇవే ఆయనకు ప్లస్ అయ్యాయి. వీటన్నింటికి మించి జూ.ఎన్టీఆర్ క్రమశిక్షణ, పట్టుదల, కఠిన శ్రమ పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేశాయి. నవరస నటనా సార్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్, యువరత్న నందమూరి బాలకృష్ణల తర్వాత ఇప్పుడు నందమూరి వంశానికి వారసుడు జూ.ఎన్టీఆరే కావడం విశేషం.
మొదట తనకు ఏ కుటుంబమయితే ఆసరా ఇవ్వలేదో ఆ కుటుంబాన్ని తన దగ్గరకు వచ్చేలా చేసుకున్నాడు. అయితే వారిని ఏనాడు జూ.ఎన్టీఆర్ విమర్శించలేదు. తన చిత్రాల్లో తాత ఎన్టీఆర్ ను, తండ్రి హరికృష్ణను, బాబాయ్ బాలకృష్ణను గుర్తుకు తెచ్చేలా సన్నివేశాలను రూపొందించుకునేవాడు. తన కుటుంబం పట్ల తనకున్న అభిమానాన్ని చిత్రంలోని పాత్రల ద్వారా చూపించేవాడు.నిన్నుచూడాలని నుండి బృందావనం వరకు జూ.ఎన్టీఆర్ కెరీర్ ఏమీ సాఫీగా సాగలేదు. మూడు హిట్లు ఆరు ఫట్లు అన్నట్టు సాగింది. అయితే 1997లోనే జూ.ఎన్టీఆర్ పదమూడేళ్లు ఉన్నప్పుడు ఆయన రాముడిగా బాల రామాయణం వచ్చింది. అది ఘన విజయం సాధించినప్పటికీ అప్పటికీ జూనియర్ ఇంకా చిన్నవాడే. పూర్తిస్థాయి కథానాయకుడిగా మాత్రం నిన్ను చూడాలని. ప్రేమ కథా చిత్రమైన నిన్ను చూడాలని నుండి బృందావనం వరకు విజయవంతమైన చిత్రాలకన్నా మాములుగా అడిన చిత్రాలే ఎక్కువ. అయితే ఎన్టీఆర్ కు స్టార్ డమ్ తీసుకువచ్చిన చిత్రం మాత్రం సింహాద్రి. అంతకుముందే ఆది చిత్రం భారీ విజయం సాధించింది. అలాంటి కథపై బాలకృష్ణ కూడా మక్కువ పెంచుకున్నట్లు వార్తలు వచ్చాయి.ఎన్టీఆర్ చిత్రాలు మామూలుగా ఆడినా నిర్మాతకు లాభాలే తెచ్చిపడుతాయి. మొదటిసారి తండ్రి కొడుకులుగా ఆంధ్రావాలాలో నటించి అభిమానులను, ప్రేక్షకులను మెప్పించాడు.