కెసిఆర్ గేమ్ ప్లాన్
తెలంగాణను తెచ్చేది, ఇచ్చేది తామేనని కాంగ్రెసు నాయకులు ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నిజామాబద్ అర్బన్ అభ్యర్థి, పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఓ అడుగు ముందుకేసి తెలంగాణ ఇస్తానని సోనియా తనకు చెప్పినట్లు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలంగా సిఫార్సు చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తుందని ఆయన చెబుతున్నారు. దీన్ని ఎదుర్కోవడానికి కెసిఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. డిఎస్ పై పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి లక్ష్మినారాయణను గెలిపించే బాధ్యతను కూడా ఆయన భుజాల మీద వేసుకున్నారు. ఈ నియోజకవర్గంలో పర్యటించి ఆయన డిఎస్ ను తూర్పూర బట్టారు. డిఎస్ ను ఓడిస్తే ఢిల్లీకి సెగ తగులుతుందని, సోనియా గాంధీకి తెలిసి వస్తుందని ఆయన అన్నారు. డిఎస్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయలేని పరిస్థితిలో పడిన తెలుగుదేశం పార్టీ బాబ్లీ బస్సు యాత్ర చేపట్టి పరోక్ష ప్రచారానికి దిగింది. ధర్మాబాద్ లో అరెస్టయి నానా హంగామా చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలతో పోస్టర్లు వేసి ఉప ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో ప్రదర్శించారు. దీని నుంచి కాపాడుకోవడానికి కూడా కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు. తెరాస అభ్యర్థులకు మద్దతుగా ప్రజా సంఘాలు రంగంలోకి దిగాయి. ప్రత్యేకంగా తెలంగాణ రాజకీయ జెఎసి తెరాస అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తోంది. తెలంగాణ విద్యార్థి జెఎసి కూడా పనిచేస్తోంది. ప్రతి వంద మంది ఓటర్లకు తెరాస ఒక బాధ్యుడ్ని నియమించినట్లు సమాచారం. రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తున్న వారినే గెలిపిస్తామని గ్రామపంచాయతీల చేత తీర్మానాలు కూడా చేయిస్తున్నారు.