థరూర్: వివాదాల పుట్ట
పైవ్ స్టార్ హోటల్లో నివాసం ఉండడం దగ్గర్నుంచి పలు వివాదాలు చుట్టుముట్టినా ప్రధాని మన్మోహన్ సింగ్ వెనకేసుకు రావడం పరిపాటిగా మారింది. ఆయన పట్ల పార్టీ, ప్రభుత్వం ఉదారంగానే వ్యవహరిస్తూ వచ్చాయి. థరూర్ అధికారిక నివాసంలో ఉండడానికి బదులు ఫైవ్ స్టార్ హోటల్లో కాపురం పెట్టడం తొలుత వివాదంగా మారింది. ప్రభుత్వం ఆమ్ ఆద్మీ అంటూ పేదల తరఫున నిలవడతామని ప్రకటిస్తుంటే ఆయన ఫైవ్ స్టార్ హోటల్లో ఉండడం వివాదంగా మారింది. పొదుపు చర్యల్లో భాగంగా ఫైవ్ స్టార్ హోటల్ ను ఖాళీ చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆయనను ఆదేశించారు. అధికారిక నివాసం అందుబాటులో లేకపోవడంతో హోటల్లో ఉంటున్నట్లు థరూర్ తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. పైగా అధికారిక నివాసంలో జిమ్ సౌకర్యం లేదంటూ ఫిర్యాదు చేశారు.
పొదుపు చర్యల్లో భాగంగా లగ్జరీ క్లాసులో ప్రయాణించకూడదని నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. పొదుపు ప్రయాణాన్ని ఆయన క్యాటిల్ క్లాస్ గా అభివర్ణించి వివాదంలో చిక్కుకున్నారు. అయితే థరూర్ వ్యాఖ్యను సీరియస్ గా తీసుకోవద్దని, అది ఆషామాషీగా చేసిన వ్యాఖ్య అని ప్రధాని మన్మోహన్ సింగ్ వెనకేసుకొచ్చారు. పార్టీ కార్యక్రమాలను కూడా ఆయన విమర్శిస్తూ వచ్చారు. గాంధీ జయంతి రోజు సెలవు తీసుకోకుండా పని చేయడమే గాంధీనికి నిజమైన నివాళి అంటూ మరోసారి పార్టీకి, ప్రభుత్వానికి ఆయన తలనొప్పి తెచ్చి పెట్టారు. నెహ్రూ విదేశాంగ విధానాన్ని తప్పు పట్టారు. ప్రభుత్వ విధానాలపై బహిరంగ వ్యాఖ్యలు చే్స్తూ వచ్చారు. ఇన్ని తలనొప్పులు తెచ్చి పెట్టినప్పటికీ ఆయనను ప్రభుత్వం, పార్టీ క్షమిస్తూ వచ్చింది. ఐపియల్ వివాదం తారాస్థాయికి చేరి, ప్రతిపక్షాలు పార్లమెంటును నడవనివ్వ స్థాయికి చేరుకోవడంతో థరూర్ కు ఉద్వాసన చెప్పక తప్పలేదు.