చిదంబరం కొండను తవ్వి...
నిజానికి, ఇప్పటికే కాంగ్రెసు పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేసింది. రాష్ట్ర ప్రభుత్వం రోశయ్య కమిటీని వేసింది. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అన్ని వర్గాలు సానుకూలంగానే ప్రతిస్పందించాయి. కానీ అది సాధించిన ఫలితమేదీ లేదు. రోశయ్య కమిటీ అడుగు కూడా ముందుకు వేయలేదు. ఆ రెండు కమిటీలకు భిన్నంగా, వాటికి పురోగామిగా శ్రీకృష్ణ కమిటీ ఉంటుందని తెలంగాణ ప్రజలు భావించారు. కానీ, వాటికి అనుగుణంగా కన్నా దానికి పూర్తి భిన్నంగా కూడా ఈ కమిటీ ఉంది. తెలంగాణ అంశాన్ని మాత్రమే కాకుండా సమైక్యాంధ్ర అంశాన్ని కూడా శ్రీకృష్ణ కమిటీ పరిశీలించడమనేది కేంద్ర ప్రభుత్వ తిరోగామి చర్యగానే భావించాల్సి ఉంటుంది.
కాగా, శ్రీకృష్ణ కమిటీ రేపు (శనివారం) 12 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో సమావేశమవుతోంది. అలాగే, హైదరాబాదులో కూడా ఆ కమిటీ తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. తెలంగాణ రాజకీయ పార్టీల నాయకులు అభిప్రాయాలనే కాకుండా, తెలంగాణ కాంగ్రెసు నాయకులు అభిప్రాయాలను కూడా కాంగ్రెసు అధిష్టానం పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు. కమిటీ విధివిధానాలను చూస్తే, దాని పరిశీలనాంశాలను పరిశీలిస్తే, ఆ కమిటీ అంత మంది నిపుణులతో ఏర్పడాల్సిన అవసరం కూడా లేదు. ప్రభుత్వపరమైన కమిటీని వేసి కొద్ది కాలంలో అభిప్రాయాలను సేకరించే ఏర్పాటు కూడా చేసుకోవచ్చు. పైగా, కమిటీకి చట్టబద్ధత గానీ రాజ్యాంగ బద్ధత గానీ లేదు. ఆ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత ఆ కమిటీ సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయాల్సిన అనివార్యత కూడా ఏమీ లేదు. వాటిని కేంద్ర ప్రభుత్వం అమలు చేయవచ్చు లేదా చేయకపోనూ వచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కమిటీ నివేదిక సమర్పిస్తే దాన్ని అమలు చేస్తారనే గ్యారంటీ ఏమీ లేదు. దాన్ని అమలుచేసే సమయంలో కూడా సీమాంధ్ర నాయకులు ప్రస్తుతం మాదిరిగానే ఒత్తిళ్లు తేవచ్చు, లాబీయింగ్ చేయవచ్చు. అప్పుడు కూడా తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందనే గ్యారంటీ ఏమీ లేదు. అందువల్ల కమిటీకి వల్ల తెలంగాణకు జరిగే ప్రయోజనం ఏమీ లేదు. పది నెలలు నిరీక్షించి తిరిగి ఇప్పటి పరిస్థితినే తెచ్చుకోవడం కన్నా ఇప్పుడే కమిటీని వ్యతిరేకించడం మంచిదనే అభిప్రాయం తెలంగాణ నాయకుల్లో వ్యక్తమవుతోంది.