కోస్తాంధ్ర సినిమా టార్గెట్ సీమ
తెలంగాణపై విపరీతంగా దాడి చేసిన తెలుగు సినిమా కొంత కాలంగా రాయలసీమ మీద పడింది. ఫాక్షనిజంపై సినిమా పేరుతో రాయలసీమ విలనిజాన్ని, కోస్తాంధ్ర నాయకత్వాన్ని హైలెట్ చేస్తూ పోతోంది. తాజాగా, రక్త చరిత్ర అందుకు మంచి ఉదాహరణ. రాయలసీమలో ఫాక్షనిజం లేదని గానీ దౌర్జన్యాలు లేవని గానీ చెప్పలేం. కానీ దాన్ని చూడాల్సిన పద్ధతిలో చూడకుండా, దాని పరిమితులను విశ్లేషించకుండా, దాని పరిణామక్రమాన్ని అధ్యయనం చేయకుండా తీసే సినిమాలు ఆ ప్రాంతాన్ని అవమానించే విధంగానే ఉంటాయి. ఆ ప్రాంతాన్ని న్యూనతకు గురి చేసేవిగానే ఉంటాయి. తెలంగాణలోని రెడ్లను దొరల పేరుతో టార్గెట్ చేసుకున్న సినిమా రాయలసీమ రెడ్లను ఫాక్షనిజం పేరుతో టార్గెట్ చేసుకుంది. వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా అనే సినిమాతో రాయలసీమపై మొదలైన దాడి తాజాగా మర్యాద రామన్న చిత్రం దాకా సాగింది. రక్త చరిత్ర సినిమాతో అది పతాక స్థాయికి చేరుకుంది.
ప్రేమించుకుందాం రా సినిమాలో హీరో కోస్తాంధ్రకు చెందినవాడైతే, మర్యాద రామన్న సినిమాలో హీరో రాయలసీమకు చిన్ననాడే దూరమై వేరే ప్రాంతంలో పెరిగినవాడు. మర్యాద రామన్న సినిమా ఎంత అర్థరహితంగా ఉందో వాస్తవ పరిస్థితులు చూసినవారికి మాత్రమే తెలుస్తుంది. కాగా, బాలకృష్ణ సమరసింహారెడ్డి, చిరంజీవి ఇంద్ర సినమాలు హీరోలు, విలన్లు రాయలసీమవారే. ఆ రకంగా హీరోలను, విలన్లను అక్కడి వారినే చేసి రాయలసీమ అంటే నరుక్కోవడాలు, చంపుకోవడాలు, పగలూ ప్రతీరాకారాలు తప్ప ఏమీ లేవనే పద్ధతిలో సినిమాలు నిర్మించారు. సమరసింహా రెడ్డి వంటి సినిమాలు హిట్ కావడంతో రాయలసీమ కోస్తాంధ్ర ఆధిపత్యంలోని సినిమా రంగానికి ముడి సరుగ్గా మారింది. గోపీచంద్ హీరోగా నటించిన శంఖం సినిమాకు కూడా అదే కథాంశంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలు కూడా రాయలసీమ ఫాక్షనిజం లేనిదే సినిమాలు చేయలేని స్థితికి చేరుకున్నారు. హీరోలు, విలన్లు రాయలసీమ ప్రాంతానికే చెందినవారైనా హీరోలు కోస్తాంధ్ర భాషను మాట్లాడడం, విలన్లు రాయలసీమ భాషను మాట్లాడడం అనుకోకుండా జరిగిందేమీ కాదని అనుకోవచ్చు.
ఒక ప్రాంతంపై ఆధిపత్యం సంపాదించడానికి ఆ ప్రాంత సంస్కృతిని ధ్వంసం చేయాలి. దాన్ని ధ్వంసం చేయాలంటే ఆ ప్రాంతంలోని చెడును ఎక్కువ చేసి చూపాలి. మరో వైపు ఆ ప్రాంతం సంస్కృతి గౌరవప్రదమైంది కాదని చాటాలి. సినిమా తెలంగాణ విషయంలో చేసింది అదే. ప్రస్తుతం రాయలసీమ మీద చేస్తోంది అదే. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం వేరుపడినప్పుడు రాయలసీమవాసులు కోస్తాంధ్ర పెద్దలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ అనుమానాలను నివృత్తి చేయడానికి శ్రీబాగ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ దాన్ని అమలు చేయలేదు. రాయలసీమలో పెడతామని హామీ ఇచ్చిన పెద్దలు ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని కోస్తాకు తరలించారు. కర్నూలు రాజధానిని తెలంగాణను విలీనం చేసుకోవడం ద్వారా హైదరాబాదుకు తరలించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే నేపథ్యంలో రాయలసీమపై కోస్తాంధ్ర సంపన్న వర్గాలు రాయలసీమపై దాడిని ఉధృతం చేశారని అనుకోవచ్చునేమో.