కోటాలో కోటా ఎందుకు?
మహిళా కోటాలో సబ్ కోటా కావాలంటూ సబ్ కోటా కావాలంటూ సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, ఆర్జెడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, జెడి (యు) నేత శరద్ యాదవ్ డిమాండ్ చేస్తూ బిల్లును వ్యతిరేకించారు. వారిని మహిళా వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. అలాగే బిఎస్పీ నేత మాయావతి కూడా ప్రస్తుత రూపంలో మహిళా బిల్లును వ్యతిరేకించారు. మహిళ నేత అయి ఉండి దాన్ని వ్యతిరేకించడాన్ని తప్పు పడుతున్నారు. కానీ వారి డిమాండ్ లోని సామంజస్యాన్ని అర్థం చేసుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నాలు జరగలేదు.
గత 14 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ల బిల్లు ఎస్సీ, ఎస్టీ, ఒబిసి, ముస్లింలకు సబ్ కోటా కేటాయించకపోవడం వల్ల ఆమోదానికి నోచుకోలేదు. కానీ యుపిఎ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అదే రూపంలో దాన్ని ఆమోదింపజేసుకుంది. మహిళా బిల్లు అమలులోకి వస్తే ఎస్సీ, బిసి, ఎస్టీ, ముస్లింలకు అన్యాయం జరుగుతుందనేది ఎవరూ కాదనలేని నిజం. ఈ వర్గాల మహిళలకు సబ్ కోటా కేటాయించి ఉంటే బిల్లుపై ఏ విధమైన వ్యతిరేకత ఎదురై ఉండేది కాదు. మంగళవారం బిల్లును బలపరుస్తూ మాట్లాడినవారిలో చాలా మంది, బిల్లు ఆమోదం తర్వాత హర్షాతిరేకాలు వ్యక్తం చేసుకుంటూ పార్టీలకతీతంగా జమ కూడిన నాయకుల్లో ఎక్కువ మంది అగ్ర కులాలవారే కావడం విశేషం. వారికి బిల్లు ప్రస్తుత రూపంలో ఆమోదం పొందడానికి ఏ విధమైన అభ్యంతరాలుండవు.
విద్య, ఉద్యోగాల్లో ప్రైవేటీకరణ వల్ల దళితులు, బహుజనులకు రిజర్వేషన్ల కోత చాప కింద నీరులా పరుచుకుంటోంది. ఇదే సమయంలో చట్టసభల్లో వారి రిజర్వేషన్లు కుదించుకుపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. అగ్రకులాల పెత్తనం చట్టసభల్లో విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల దళిత, మైనాటిరీ, బహుజన స్త్రీలే కాదు, పురుషుల గొంతు కూడా మరింత మైనారిటీలో పడిపోతుంది. మహిళలకు సగం వాటా దక్కాలనే వాదనను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఆ సగం మందిలో జనాభాలో మెజారిటీ అయిన దళిత, మైనారిటీ, బహుజన స్తీలు ఉండాలని కోరుకోవడం మరింత న్యాయం. ఆ న్యాయాన్ని యుపిఎ ప్రభుత్వం మెజారిటీ పేరుతో కాదనే స్థితికి వచ్చింది.