కెసిఆర్పై ముప్పేట దాడి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్పై ఆయన కాంగ్రెసు పార్టీపై చేస్తున్న ఆరోపణలను ప్రజలు ఆమోదించడం లేదు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న పార్టీగా, తెలంగాణ ఉద్యమం తుది దశకు చేరిన దశలో తమతో వచ్చిన వారే తెలంగాణవాదులు మిగిలిన వారు కాదన్నట్లుగా మాట్లాడిన టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడి తెలంగాణ ఉద్యమాన్ని ప్రశ్నార్థకంలో పడేశారు. తెలంగాణ ఉద్యమ పేటెంట్ హక్కులు తమవే అన్నట్లుగా మాట్లాడే కెసిఆర్ ఇతర పార్టీల నేతలు తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నప్పటికీ తమతో కలిసి రాకుంటే సాంఘిక బహిష్కర అంటూ పలికిన టిఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలే అత్యంత దారుణానికి పాల్పడినప్పటికీ కేవలం బహిష్కరించి వదిలి వేయడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. కెసిఅర్కు తెలియకుండా ఇది జరిగి ఉండదని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు వీరు క్రాస్ ఓటింగ్కు పాల్పడతారని మరో ముగ్గురు సీనియర్, కెసిఆర్కు దగ్గరగా చెప్పబడే ఎమ్మెల్యేలకు తెలుసనే వాదనలు కూడా వినిపించిన నేపథ్యంలో అందరూ కెసిఆర్ను కూడా అనుమానంగా చూస్తున్నారు. 2009 తెలంగాణ ప్రకటన తర్వాత తెలంగాణ ప్రజలంతా కెసిఆర్ వెంట నడిచారు. అన్ని పార్టీలు కూడా ఆయన వెంట నడవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. కానీ గత కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ ఉద్యమం పట్ల టిఆర్ఎస్ చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుందని పలువురు యోచిస్తున్నారు. కెసిఆర్ను ఏమైనా అంటే ప్రజలు తమను నిలదీస్తారని బయపట్ట టిడిపి, కాంగ్రెసు నేతలు ఇప్పుడు అదే కెసిఆర్ను నిలదీయాల్సిన పరిస్థితి వచ్చింది.ఇన్నాళ్లు తన వ్యాఖ్యలతో ఇతరులను ఆత్మరక్షణలో పడవేసిన టిఆర్ఎస్ ఇప్పుడు తానకు తానే సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.
కెసిఆర్కు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మధ్య రచ్చబండ కార్యక్రమం ఘటననుండి కెసిఆర్, టిఆర్ఎస్ ఇమేజ్ తగ్గుతూ వస్తుంది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యోగ సంఘాలను సహాయ నిరాకరణకు పురిగొల్పిన కెసిఆర్ ఆ తర్వాత ఏమీ సాధించకుండానే వారి సహాయ నిరాకరణను విరమింపజేశారు. అప్పుడే చాలామందికి కెసిఆర్ తీరుపై అసంతృప్తి ఏర్పడింది. ఆ తర్వాత మిలియన్ మార్చ్ ఏకపక్షంగా ప్రకటించారు. పరీక్షలు ఉన్నందున బిజెపి, సిపిఐ వద్దన్నప్పటికీ కెసిఆర్ తగ్గలేదు. ఆ తర్వాత మళ్లీ ఆయనే మూడు రోజుల ముందు మిలియన్ మార్చ్ మార్పు చేయాలంటి జెఏసిపై ఒత్తిడి తెచ్చారు. ఆయన ఏకపక్షంగా వెళ్లడం జెఏసిలోని ఇతర పార్టీలకు నచ్చలేదు. తప్పని పరిస్థితుల్లో కెసిఆర్ తలవంచక తప్పలేదు.
ఆ సమయంలో కెసిఆర్కు, జెఏసి చైర్మన్ కోదండరామ్కు మధ్య విభేదాలు వచ్చినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. మిలియన్ మార్చ్లో విగ్రహాల విధ్వంసాన్ని కూడా మార్చ్లో పాల్గొన్న బిజెపి, సిపిఐ ఖండించింది. అన్ని పార్టీలు, ప్రజలంతా ముక్తకంఠంతో విగ్రహాల విధ్వంసంపై టిఆర్ఎస్ను దోషిగా నిలిపాయి. అయితే అవి చిన్న చిన్న గాయాలని మాసిపోతాయి అనుకున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో అతిపెద్ద గాయం తగిలింది. ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడటంతో ఇన్నాళ్లు ఇతర పార్టీల చిత్తశుద్ధి ప్రశ్నించిన కెసిఆర్, ఇప్పుడు తమ చిత్తశుద్ధి ఏమిటనే దానికి సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది.