అధిష్టానం వద్ద బొత్స, కిరణ్ చెరో మాట
ఉద్యోగులు సకల జనుల సమ్మె విరమించాలని కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ప్రకటన వెనుక బొత్స చొరవే ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆదివారం సమ్మెపై ప్రకటన చేయాలని కోరినప్పటికీ బొత్స అంతకుముందు రోజే విజ్ఞప్తి చేశారని వార్తలు వచ్చాయి. అయితే సిఎంతో ఆజాద్ భేటీ అయి కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రకటన చేశారని తెలుస్తోంది. మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో పరిస్థితి అదుపులోకి వస్తుందని ముందున్నంత తీవ్రత ఇప్పుడు లేదని కొన్ని రాజకీయ చర్యల ద్వారా పరిస్థితిపై పట్టుబిగించవచ్చునని ముఖ్యమంత్రి చెప్పినట్లుగా తెలుస్తోంది.
కేంద్ర హోంమంత్రి చిదంబరంతో జరిగిన భేటీలో భద్రతా దళాలు కొన్ని సందర్భాలలో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చినప్పటికీ సంయమనంతో వ్యవహరించడం వల్లనే సమ్మెలో అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, తాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని, మంత్రుల బృందాన్ని నెలకొల్పి ఉద్యోగులతో చర్చలు జరిగేలా చూశానని చెప్పినట్లు తెలుస్తోంది. సమ్మెపై సామ, దాన, భేద, దండోపాయాలను సరైన రీతిలో ఉపయోగించినందు వల్లే పరిస్థితి నియంత్రణలోకి వచ్చిందని సిఎం చెప్పినట్లుగా తెలుస్తోంది.