సత్తిబాబు స్టైలే వేరు
క్యాబినెట్లో తనకు సరియైన స్థానం కల్పించక పోయే సరికి క్యాబినెట్ అంటే ప్రైవేట్ కంపెనీ అనుకున్నావా అని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని ఆ సమయంలో ప్రశ్నించాడు. ముఖ్యమంత్రి కేబినెట్ కూర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కేబినెట్లో పని చేస్తున్నప్పటికీ తన శాఖపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. మూడు నెలల తర్వాత శాఖ మార్పు చేస్తానని కిరణ్ హామీ ఇవ్వడంతో కాస్త చల్లబడ్డట్టు కనిపించినా లోలోన మాత్రం అసంతృప్తి రగులుతోంది. ముఖ్యమంత్రిపై ఆయన అసంతృప్తి మంగళవారం మరోసారి బయటపడింది. ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్రాజెక్టు రగడ కారణంగా శ్రీకాకుళం జిల్లా వట్టితాండ్రలో ఇద్దరు మరణించడంపట్ల ఆయన స్వయంగా తాను ఏ ప్రభుత్వంలో అయితే ఉన్నాడో అదే ప్రభుత్వాన్ని తప్పు పట్టారు.
నేరుగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి పోలీసుల కాల్పుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారంట. ఆ తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వచ్చి పోలీసులు తీరు తనను బాధించిందని, ఇది ప్రభుత్వం వైఫల్యం అని ముక్కు సూటిగా చెప్పేశారు. ఏదైన అనుకోని సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వంలో ఉన్న వారు దానిపైన ప్రభుత్వం తప్పు లేదన్నట్లు వివరణ ఇచ్చుకుంటారు. కానీ బొత్స మాత్రం అందుకు విరుద్దంగా ప్రవర్తించి ప్రభుత్వాన్ని ఇరుకున పడేశారు. అంతేకాదు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికే మంత్రులు వెనుకడుగు వేస్తుంటే బొత్స మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్స్పై పోరాటం చేస్తున్న సమయంలో జగన్ దీక్షపై కామెంట్లు చేయటం విశేషం. అయితే సత్తన్న ఈ స్టైల్ ఆయనకు ఏదైన మంచి శాఖ వచ్చే వరకు మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది. రోశయ్య తర్వాత ముఖ్యమంత్రి రేసులో ఉన్న తనకు కిరణ్ అంతగా ప్రాధాన్యం లేని శాఖ ఇచ్చారని మూడునెలల తర్వాత శాఖ మార్పులు మాట ఇచ్చిన కిరణ్ తన మాట నిలబెట్టుకోకంటే బొత్స ఢిల్లీకి వెళ్లి గోల చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.