నారా చంద్రబాబు జాక్పాట్
అనంతపురం జిల్లా విజయం వెనక చంద్రబాబు గొప్పదనం గానీ, తెలుగుదేశం పార్టీ ప్రాబల్యం గానీ లేదు. ఇక్కడ తెలుగుదేశం బలం పెరిగిందని చెప్పడానికి కూడా ఏమీ లేదు. కేవలం కాంగ్రెసులోని అంతర్గత విభేదాల వల్లనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి విజయం సాధించారు. కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వర్గం సహకరించడం వల్ల కాంగ్రెసు అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి ఓడిపోయి, ఆయన గెలిచారు. అందువల్ల ఇందులో చంద్రబాబు సంతోషించాల్సింది ఏమీ లేదు. శాసన మండలిలో తమ బలం పెరిగిందని చెప్పుకోవడానికి పనికి వస్తుంది.
కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ జగన్ వర్గం, కాంగ్రెసు పార్టీ మధ్య విభేదాల వల్లనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంగర రామ్మోహన్ గెలిచారు. అయితే, వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు వచ్చి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించడం వల్ల భవిష్యత్తులో తాము లాభపడతామనే అంచనాకు చంద్రబాబు రావడానికి మాత్రం వీలుంది. అందులో కొంత వాస్తవం లేకపోలేదు.
నేరుగా ప్రజలు ఓటేసే ఎన్నికలు కాకపోవడం వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలు అంశాలు ప్రభావం చూపుతాయి. డబ్బులు ప్రధాన పాత్ర వహిస్తాయి. క్యాంపుల నిర్వహణ కూడా పనిచేస్తుంది. వ్యక్తిగత ప్రయోజనాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఎన్నికల ఆధారంగా పార్టీల బలాబలాలను అంచనా వేయలేం. కానీ, చంద్రబాబుకు ఏదో మేరకు ఈ ఫలితాలు ఉత్సాహాన్ని ఇచ్చేవే.