తెలంగాణపై సోనియా తేలుస్తారా?
జూన్ మొదటి వారంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సిద్ధపడుతున్నారు. తెలంగాణ రాజకీయ జెఎసి కూడా దానికి రంగం సిద్ధం చేస్తోంది. తెలంగాణ అంశాన్ని వెంటనే తేల్చాలని కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ సమస్యను నానిస్తే పార్టీ నష్టపోతుందని వారు కూడా అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్ర నాయకులు వ్యతిరేకిస్తున్నప్పటికీ సమస్యను సత్వరమే తేల్చాలని మాత్రం కోరుతున్నారు. అందువల్ల కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ సమస్యను జూన్ మొదటివారంలో పరిష్కరించవచ్చునని నమ్ముతున్నారు.
కాగా, కాంగ్రెసు అధిష్టానం కదలికలు మాత్రం అనుమానాలు రేకెత్తిస్తూనే ఉన్నాయి. డిప్యూటీ ముఖ్యమంత్రి, స్పీకర్, పిసిసి అధ్యక్ష పదవులను జూన్ మొదటి వారంలో భర్తీ చేసే అవకాశాలున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తెలంగాణ సమస్యను నానుస్తున్నట్లే ఈ పదవుల భర్తీని కూడా కాంగ్రెసు అధిష్టానం నానుస్తోంది. ఆ పదవులను భర్తీ చేయడం ద్వారా కాంగ్రెసు తెలంగాణ నాయకులను బుజ్జగించే ప్రయత్నాలను అధిష్టానం చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయంలో పదవులను ఇచ్చి తెలంగాణ ఉద్యమ ఉధృతిని తగ్గించడమనే సూచన కూడా ఉంది. దీన్నే కాంగ్రెసు అధిష్టానం అమలు చేస్తోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అదలా వుంటే, ఎస్ జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ కాంగ్రెసు పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పోరాడుతారనే వార్తలు వస్తున్నాయి. తెరాస అధ్యక్షుడు కెసిఆర్ను, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి కాంగ్రెసు వ్యూహంలో భాగంగా జైపాల్ రెడ్డి వస్తున్నారని అంటున్నారు. జైపాల్ రెడ్డి అలా వస్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ను కాంగ్రెసు అధిష్టానం అటక ఎక్కించే పరిస్థితే ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ కాంగ్రెసు పార్టీ తెలంగాణలో పట్టు సాధిస్తే కాంగ్రెసుకు ఢోకా ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా, తెలంగాణపై సోనియా గాంధీ కపట ధోరణినే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.