'కిరణ్కు తెలంగాణ సెగ వద్దు'
దీంతో సమావేశానికి సీనియర్ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించాలని యోచిస్తున్నారు. ఉద్యమం నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పూర్తిగా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారంటున్నారు. అందువల్ల ప్రజా ప్రతినిధులుగా సమస్యలను పరిష్కరిస్తూనే తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చాలని కృతనిశ్చయంతో ఉన్నామంటున్నారు. ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలు, మౌలికా సదుపాయల కల్పనలో కూడా భాగస్వాములు కావాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కనుక పదవులకు రాజీనామా, సకల జనుల సమ్మె, నిరాహార దీక్ష తదితర రూపాల్లో ఒత్తిడి తెచ్చామని, ఇంతకన్నా ఏమి కావాలని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ నిరసనలతో కేంద్రం కదిలిందని, త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిందని గుర్తు చేస్తున్నారు. ఈ సమయంలో రాష్ట్ర పరిధిలో లేని అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ లక్ష్యంగా విమర్శలకు దిగడం, ప్రభుత్వానికి సహకరించకపోవడం సరికాదని చెబుతున్నారు. అయితే, నవంబర్ 1న రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొనడం సరికాదని అత్యధిక ప్రజా ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఇంకా విభజన జరగనందున పాల్గొన్నప్పటికీ నష్టమేమీలేదని కొందరు వాదిస్తుండటంతో వారిని కూడా వేడుకలకు దూరంగా ఉంచేలా నచ్చజెప్పాలని నిర్ణయించుకున్నారు. కాగా, సంక్షేమ కార్యక్రమాల అమలుకు దోహదపడే రచ్చబండలో పాల్గొనాలని అధికశాతం ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.
మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మా రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం శాసనసభ్యులు భేటీ కానున్నారు. సీనియర్ శాసనసభ్యుల మద్దతు పక్కన పెడితే తెలంగాణ మంత్రుల మద్దతు మాత్రం వీరికి ఖచ్చితంగా ఉండే అవకాశముంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయకుండా తెలంగాణ కోసం ఉద్యమించడమే మేలని పలువురు మంత్రులు ఎప్పటి నుండో భావిస్తున్నారు. అందుకే ఎంపీలు నిత్యం మంత్రులు రాజీనామా చేయాలనే డిమాండ్ వారికి రుచించడం లేదు. మంత్రి బస్వరాజు సారయ్య కూడా గురువారం ముఖ్యమంత్రిగా కిరణ్ రాష్ట్రంలో అంతటా పర్యటిస్తారని చెప్పారు. త్వరలో సిఎం పర్యటనలో ఎమ్మెల్యేలూ ఖచ్చితంగా పాల్గొనే అవకాశముంది.