చిరు తీరుపై అప్పుడో మాట ఇప్పుడో మాట!
చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించిన వాసిరెడ్డి చిరంజీవి వల్లే తనకు రాజకీయ ఇమేజ్ వచ్చిందని చెబుతూనే ఆయనతో మాత్రం కాంగ్రెస్లోకి వెళ్లనని కుండబద్దలు కొడుతున్నారు. ఆమెకు కేవలం కాంగ్రెస్ విలీనంపై విముఖత ఉంటే నెల పది రోజుల క్రితం చిరంజీవి న్యూఢిల్లీ నుండి విలీనం ప్రకటన చేసినప్పుడే ఆమె చిరంజీవితో విభేదించాల్సి ఉండాల్సింది. కానీ ఆమె అలా చేయలేదు. మరోకొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చిరంజీవి తనకు తప్పనిసరిగా టిక్కెట్ ఇస్తారనే భావనలో ఉన్న వాసిరెడ్డి పద్మ అనుభవజ్ఞుడు అయిన సి.రామచంద్రయ్యకు ఇవ్వడంతో పూర్తిగా నిరాశకు లోనయినట్టుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు టిక్కెట్ వస్తుందని ఆశతో ఉన్న ఆమె టిక్కెట్ రాలేదన్న నిరాశతోనే కాంగ్రెస్తో విలీనాన్ని ఇప్పటికిప్పుడు వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా తాను మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరతానని కూడా స్పష్టం చేశారు.
చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనం ప్రకటన చేసిన తర్వాత ఆ పార్టీ నేత శోభారాణి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సమయంలో వాసిరెడ్డి పద్మ శోభారాణిపై విరుచు పడ్డారు. చిరంజీవి అభిప్రాయంతో అందరం ఏకీభవిస్తున్నామని, అది సరియైన నిర్ణయమని చెప్పారు. ఆమెకు ఏమూలో కాంగ్రెస్ పార్టీతో విలీనం ఇష్టం లేకుంటే శోభారాణి వ్యాఖ్యలకు మద్దతు తెలపడమో లేక కామ్గా ఉండటమో చేసేవారని, కానీ శోభారాణి వ్యాఖ్యలపై ధీటుగా స్పందించి విలీనం తప్పులేదని చెప్పారని, కానీ ఇప్పుడు మాత్రం ఎమ్మెల్సీ సీటు రామచంద్రయ్యకు ఖరారైన తర్వాత మాత్రం ఆమె ధోరణిలో తేడా వచ్చినట్టుగా పలువురు భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ సీటు రాకపోవడంపై వాసిరెడ్డి పద్మతో పాటు పలువురు ముఖ్యనేతలు అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో విలీనం వలన తాము వెనుకబడిపోయే అవకాశం ఉందని కూడా మరికొందరు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.