తెరాస అధినేత కెసిఆర్పై మరోసారి 'కారు'మబ్బులు
కెసిఆర్ ప్రకటనను తప్పు పడుతూ ఒయు జెఎసి నాయకులు ఆ లేఖ రాశారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం ఎదురు చూస్తున్నారు తప్ప 2014 ఎన్నికల కోసం కాదని వారన్నారు. ఎన్నికలతో ముడిపెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యాన్ని వాయిదా వేయవద్దని వారు సలహా ఇచ్చారు. కాంగ్రెసు 2014లో దొరకదా అంటూ కెసిఆర్ చేసిన ప్రకటన ఉద్యమాన్ని నీరు గార్చే విధంగా ఉందని వారు విమర్శించారు. రెండు వారాల్లో తెలంగాణ వస్తుందని కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులు దీక్షా శిబిరంలో కెసిఆర్ చేసిన ప్రకటనను, తెలంగాణ ఇవ్వకపోతే విషం తాగి చస్తానని చేసిన వ్యాఖ్యను వారు తప్పు పట్టారు. కెసిఆర్ లాంటి నాయకులు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
కాగా, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుల కృషితో ఏర్పడిన తెలంగాణ సాధన సమన్వయ కమిటీ కూడా కెసిఆర్కు తలనొప్పిగా మారే అవకాశాలున్నాయి. కెసిఆర్ అందరినీ కలుపుకుని వెళ్లడం లేదనే అభిప్రాయంతో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి తెలంగాణ పెద్దలు ఈ వేదికకు నాయకత్వం వహిస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఈ వేదిక దూకుడుగానే వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని తట్టుకోవడానికి కెసిఆర్ ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. తన వ్యూహానికి పదును పెట్టి ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉంది.