అక్కడే రాజీనామా ఇచ్చేస్తున్నారు!
ఆ రాజీనామాలకు ప్రాధాన్యత ఉండదని అందరికీ తెలిసినప్పటికీ అప్పటికప్పుడు తమపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఈ తరహా రాజీనామాలు వారు చేస్తున్నారు. మహబూబ్ నగర్ కొడంగల్ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఇటీవల తన సొంత జిల్లాకు వెళ్లినప్పుడు స్థానిక జెఏసి కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ టిడిపి నేతలం గతంలోనే రాజీనామా చేశామని అయితే స్పీకర్ వాటిని ఆమోదించడం లేదని నచ్చజెప్ప చూశారు. ఆయన మాటలు వారు బేఖాతరు చేస్తూ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో రేవంత్ చేసేది లేక తన రాజీనామా పత్రాన్ని అడ్డుకున్న కార్యకర్తలకు ఇచ్చేసి దానిని మీరే ఆమోదింప చేయండని ఇచ్చి చక్కా వెళ్లి పోయారు.
ఆ తర్వాత ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, బోథ్ శాసనసభ్యుడు నగేష్ను సైతం తెలంగాణవాదులు అడ్డుకోవడంతో వారూ రేవంత్ రెడ్డి మాదిరే తమ రాజీనామాలు వారి చేతిలో పెట్టి వెళ్లి పోయారు. పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం ఇబ్రహీంపట్నంలో సమ్మెలో పాల్గొనేందుకు వెళ్లారు. అక్కడి జెఏసి కార్యకర్తలు అడ్డుకోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల పంథాలోనే రాజీనామా వారి చేతులో పెట్టారు. ఉద్యమం తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో స్పీకర్ ఆమోదించడనే భావనతోనో లేదా మరో కారణంతోనో రాజీనామాలపై వెనక్కి వెళుతున్న ప్రజా ప్రతినిధులు గ్రామాల్లోకి వెళ్లినప్పుడు మాత్రం తెలంగాణవాదుల ధాటికి, ప్రాధాన్యత లేనప్పటికీ రాజీనామాస్త్రం ప్రయోగించక తప్పడం లేదు.