వికీలీక్స్: వైయస్ పాలనలో అవినీతి బారెడు
వైయస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే అమెరికా అధికారులు ఇక్కడి అవినీతిని గుర్తించింది. హైదరాబాదులో పర్యటించిన చెన్నై కాన్సులేట్ అధికారులు కరప్షన్ ప్లేగ్స్ ఆంధ్రప్రదేశ్ బిగ్ టికెట్ స్పెండింగ్ ప్రోగ్రామ్స్ పేరిట ఒక నివేదికను తయారు చేసింది.ఎపిలో అధికార కాంగ్రెసు పార్టీ సగటు జీవిని లక్ష్యంగా చేసుకొని సంక్షేమ పథకాల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని చెప్పారు. ఈ పథకాలు రాజకీయంగా ఆదరణ పొందుతున్నప్పటికీ వైయస్ ప్రభుత్వం భారతదేశంలో మునుపెన్నడూ లేనంత అవినీతికి పాల్పడుతోందన్న అర్థంలో నివేదిక ఉందని తెలుస్తోంది. నీటి పారుదల ప్రాజెక్టులు తదితర పథకాల్లో భారీ అవినీతి జరిగిందనిఅప్పట్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైయస్పై అవినీతిపై బాగా విమర్శలు చేశారని చెప్పారు. వైయస్ సైతం అంతే స్థాయిలో బాబుపై విరుచుకు పడ్డ విషయం తెలిసిందే.
పథకాల్లో అవినీతిపై రాష్ట్రమంతా ఏకాభిప్రాయంతో ఉందని కాన్సులేట్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రజలకు భారీగా లబ్ధి చేకూరుతుండటంతో ప్రజలెవరూ అవినీతిని పట్టించుకోరని వైయస్ భావించినట్లుగా అందులో పేర్కొన్నారు. సంక్షేమ పథకాల మాటున వైయస్ అవినీతిని ఉన్నత వర్గాలు చీదరించుకున్నాయన్నారు. గణనీయమైన నిధులు అవినీతి కింద తరలిపోయినా కూడా ఎక్కువ మొత్తం డబ్బు సగటు జీవికి కూడా చేరేలా రూపొందించారని పేర్కొన్నారు. ఈ సంగతి దృష్టిలో పెట్టుకొన్న కాంగ్రెసు ఎంతో ఆత్మ విశ్వాసంతో ఉంది. అవినీతి అన్నది టిడిపికి ప్రధాన ఆయుధం కాబోదని భావిస్తోందని నివేదికలో పేర్కొన్నారు.