వైయస్పై వికీలీక్స్ మరో కేబుల్
భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని సిఎం వైయస్ రాజకీయ ప్రత్యర్థులు కూడా తరుచూ ఆరోపిస్తున్నారని దౌత్య పత్రంలో చెన్నైలోని అమెరికన్ కాన్సులేట్ అధికారి పేర్కొన్నారు. ప్రాణహిత అనుకున్న సమయంలో పూర్తి కావడం అసాధ్యమని, ఒకవేళ పూర్తయినా దానికి కావాల్సిన విద్యుత్ను అందించడం అసాధ్యమని సాక్ష్యాత్తూ సాగు నీటి కార్యదర్శే సందేహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు విద్యుత్ చాలా అవసరమని అంత విద్యుత్ తేవడం కష్ట సాధ్యమని విద్యుత్ అధికారులు సైతం తేల్చి చెప్పారు. ప్రాణహిత పూర్తయితే రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న విద్యుత్లో మూడోవంతు విద్యుత్ దానికే కేటాయించాల్సి వస్తుందని అప్పుడు రాష్ట్ర అవసరాలకు విద్యుత్ సరిపోదని అధికారులు చెప్పారు. ఒకవేళ కెజి బేసిన్ నుండి అందుతుందని అనుకున్నప్పటికీ ఆ విద్యుత్ అప్పటికే అందుతుందా అనే సందేహాన్ని ఎపిఈఆర్సీ నిపుణుడు వ్యక్తం చేశారు.
''రైతుల ఓట్ల కోసం మౌలిక వసతుల రాజకీయాలకు రాష్ట్ర సర్కారు పాల్పడుతోంది. ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం ఓ రాజకీయ ఎత్తుగడగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు బాధ్యతలను చూస్తున్న నీటిపారుదల శాఖ కార్యదర్శి.. ప్రాజెక్టు నిర్మాణంపై అనుమానాలు వ్యక్తే చేశారు. ఇలాంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని నాలుగేళ్లలో పూర్తి చేయడమన్నది అసాధ్యమని ఒకవేళ పూర్తయినా విద్యుత్ ఇవ్వడం కష్టమన్నారు. వీటన్నింటిని బట్టి చూస్తే అంతకుముందు అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు తర్వాతి ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకే ఈ రాజకీయ ఎత్తుగడ వేసినట్లుగా కనిపిస్తోందని, ఇందులో అవినీతికి పాల్పడే అవకాశముంద''ని అమెరికా దౌత్యవేత్తలు అన్న కేబుల్స్ను వికీలీక్స్ బయట పెట్టింది.