తెలంగాణ: గులాం నబీ ఆజాద్ తేల్చేస్తాడా?
ఆజాద్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చర్చల ద్వారానే పరిష్కారం అని చెప్పారు. అన్నట్టుగానే తెలంగాణ ప్రాంత నేతలను, సీమాంధ్ర ప్రజాప్రతినిధులను పలుమార్లు తన వద్దకు రప్పించుకొని వారితో చర్చలు జరిపారు. తెలంగాణ తప్ప మరో ప్రత్యమ్నాయం అవసరం లేదని తెలంగాణ నేతలు కుండబద్దలు కొడుతుండగా, సమైక్యవాదమే సరైన నిర్ణయమని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చెబుతూ వస్తున్నారు. ఇరుప్రాంతాల నేతల వాదనలను ఆజాద్ తీసుకున్నారు. వీరంతా నాడు శ్రీకృష్ణ కమిటీ ముందు ఏం వాదన వినిపించారో ఇప్పుడూ అదే చెప్పారు. వీరి వైఖరిలో మార్పులేదు. అలాంటప్పుడు ఆజాద్ ఈ అంశాన్ని ఏలా తేలుస్తాడో చూడాలని నేతలు, పార్టీలు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆజాద్ నివేదికకు కొద్ది రోజుల ముందే సకల జనుల సమ్మె ప్రారంభం కావడంతో అధిష్టానం సైతం ఆజాద్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తోంది.
సమ్మె కారణంగా ఉద్యోగులు, కార్మికులు, వివిధ రకాల వృత్తుల వారు తమ విధులకు హాజరు కాకపోవడంతో రాష్ట్రంలో ప్రస్తుతం విషమ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆజాద్ నివేదిక కోసం అధిష్టానం ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంతేకాకుండా కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోని పక్షంలో తాము మరోసారి రాజీనామాకు సిద్ధంగా ఉన్నామన్న హెచ్చరికలు టి-కాంగ్రెసు ఎంపీలు చేశారు. త్వరలో ఢిల్లీ వెళ్లి పరిస్థితులు అనుకూలంగా లేకుంటే రాజీనామా చేస్తామని చెప్పారు. దీంతో ఆజాద్ ఈ తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అద్యక్షుడ బొత్స సత్యనారాయణ సలహాలు తీసుకొని రూపొందించే అవకాశాలున్నాయి. తెలంగాణ అంశంపై సిఎం తటస్థంగా ఉండగా, పిసిసి చీఫ్ బొత్స త్వరగా పరిష్కరిస్తేనే బాగుంటుందనే భావనతో ఉన్నారు. మరి ఆజాద్ నివేదిక తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపిస్తుందా? లేదా చూడాలి.