జగన్ పార్టీకి ముహూర్త బలం
పార్టీ స్థాపనకు ముహూర్త బలంపై కూడా చర్చ జరుగుతోంది. మార్చి 7వ తేదీన పార్టీని స్థాపిస్తే వైయస్ జగన్కు తిరుగు ఉండదని జోతిష్య పండితులు చెబుతున్నారు. మార్చి 7వ తేదీన పార్టీని స్థాపిస్తే 2034 వరకు జగన్కు మాహా రాజయోగం ఉంటుందట. నిజానికి, ఒక్కసారి అధికారంలోకి వస్తే 40 ఏళ్ల రాజ్యం చేయాలనేది వైయస్ జగన్ అభిమతం. 2014 ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని, ఆ తర్వాత నాలుగు దశాబ్దాల పాటు వైయస్ రాజ్యం ఉంటుందని ఆయన సభల్లో చెబుతున్నారు. ఈ ముహూర్త బలాన్ని చూసుకునే ఆయన ఈ మాటలంటున్నారు కావచ్చు. మార్చి 7వ తేదీ దాటితే మళ్లీ మే వరకు మంచి ముహూర్తం లేదని జోతిష్య పండితులు అంటున్నారు.
కాగా, ఎన్నికల కమిషన్ వైయస్ జగన్కు ఝలక్ ఇచ్చింది. పార్టీ కోసం ఇచ్చిన ప్రకటన సరిగా లేదని, మరోసారి ప్రకటన ఇవ్వాలని ఎన్నికల కమిషన్ తెలిపింది. దాంతో వైయస్ జగన్ పార్టీని ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేయించుకోవడానికి మరోసారి ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. వైయస్సార్ పార్టీ పేర జగన్ తన పార్టీ పేరును నమోదు చేయించాలని అనుకుంటున్నారు. పార్టీ జెండా ఇప్పటికే ఖరారైంది. రెండు మూడు రకాల జెండాలను రూపొందించారు. వాటిలో ఒక్కదాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వైయస్ఆర్లోని ఇంగ్లీషు పదాల్లో వై యూత్కు, ఎస్ శ్రామికవర్గానికి, ఆర్ రైతాంగానికి సంకేతంగా నిలిచేలా జెండాకు రూపకల్పన చేశారు.