ప్లాన్ రివర్స్: సూడాన్లో సెటిలవ్వాలనుకున్న భాను!
రిపోర్ట్ ప్రకారం.. సెటిల్మెంట్ల ద్వారా సంపాదించిన కోట్ల డబ్బుతో విదేశాల్లో దందాకు భాను ప్రయత్నించాడు. సూడాన్లో కేబుల్ నెట్వర్క్ రంగంలోకి ప్రవేశించడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసుకున్నాడు. దానికి సంబంధించి కొందరితో చర్చలు కూడా జరిపాడు. అయితే జైలు నుంచి సూరి విడుదల కావడం, తన సొంత దందాలపై కన్నెర్ర చేయడం, అన్నపూర్ణ ప్యాకేజింగ్ తన పీకమీదకు రావడంతో భాను కిరణ్ సతమతమయ్యాడు.
సూరిని చంపనిదే తాను బతకలేననే అంచనాకు వచ్చాడు. సూరిని చంపేందుకు ఓ నాటు తుపాకీని సేకరించినప్పటికీ చివరి నిమిషంలో ఆయుధాన్ని మార్చాడు. ల్యాండ్ సెటిల్మెంట్ల ద్వారా భాను భారీగా డబ్బు సంపాదించాడు. ఆ డబ్బులో సింహభాగాన్ని సూరితోపాటు ఆయన అనుచరుల కోర్టు ఖర్చుల కోసమే వెచ్చించినట్లు సిఐడి అధికారుల విచారణలో భాను తెలిపినట్లుగా తెలుస్తోంది.
సెటిల్మెంట్ల ద్వారా కోట్లు సంపాదించి తనకు లెక్కచెప్పడం లేదని సూరికి అనుమానం రావడంతో తనను లేపేస్తా అని భానును తరుచూ బెదిరించేవాడట సూరి. సూరి హత్యకు పథకం వేసిన తర్వాత భాను తన కుటుంబ సభ్యులను బెంగళూరుకు పంపించేశాడు. హత్య తర్వాత తన అనుచరుడైన సుబ్బయ్య సహకారంతో సురక్షితంగా పారిపోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆంజనేయులు గుప్తా, మరికొందరు వ్యక్తుల నుంచి సూరి హత్యకు ఒక్కరోజు ముందు 1.70 లక్షలు తెప్పించుకున్నాడు.
సూరిని చంపడం కోసం తెప్పించిన తుపాకీని తన గన్మన్ మన్మోహన్ సింగ్ ద్వారా స్కోడా కారు సీటు కవర్లో పెట్టించాడు. అయితే... చివరి నిమిషంలో ఈ ఆయుధం పేలుతుందో లేదో అన్న అనుమానం తలెత్తింది. నాటు తుపాకీని అక్కడి నుంచి తీసేసి మన్మోహన్ సింగ్ రివాల్వర్ను సీటు కవర్లో పెట్టాడు.
సూరి, మధు, భాను కారులో న్యాయవాదిని కలిసి వస్తుండగా సూరికి ఎస్కార్టుగా ఉన్న వాసు, శ్రీనులను పథకం ప్రకారం మరోచోటికి పంపించాడు. కారు నవోదయ కాలనీ సమీపంలోకి చేరుకోగానే వెనుక సీట్లో కూర్చున్న భాను పాయింట్ బ్లాంక్ రేంజ్లో సూరిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపి అటాక్ అటాక్ అని అరిచాడు. కారు ఆపాలని మధుకు చెప్పాడు. కారు ఆగగానే కిందికి దిగి పరిగెత్తాడు.
ముందే సిద్ధం చేసుకున్న బైక్ల మీద లోక్నాథ్ తదితరులతో కలిసి కూకట్పల్లికి వెళ్లాడు. అక్కడి నుంచి కారులో గన్మన్ మన్మోహన్, లోక్నాథ్తో కలిసి షోలాపూర్ వెళ్లాడు. దారిలో తమను ఎవరూ అనుమానించకుండా ముఖాలకు మంకీ క్యాప్లు పెట్టుకున్నారు. షోలాపూర్ నుంచి లోక్నాథ్ను వెనక్కి పంపాడు. అక్కడి నుంచి పూణె, ముంబై తర్వాత గుర్గావ్ చేరుకున్నాడు. గుర్గావ్లో ఉన్నప్పుడు మన్మోహన్ తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడాడు.
ఆవిషయం తెలిసిన భాను అలా మాట్లాడొద్దని చెప్పాడు. భానుకు చెప్పకుండా మన్మోహన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత భాను మధ్యప్రదేశ్లోని సియోనీకి మకాం మార్చాడు. మహేశ్ కుంజుమన్ పేరుతో అడ్రస్ ప్రూఫ్లు సంపాదించి యూనినార్ సిమ్కార్డు కొన్నాడు. పాండిచ్చేరికి వెళ్లి అక్కడి నుంచి కర్ణాటక వచ్చి డబ్బుకోసం ఓ వ్యక్తిని కలవడానికి జహీరాబాద్కు వస్తూ సిఐడికి పట్టుబడ్డాడు.
సెటిల్మెంట్లలో తనకు సినీ నిర్మాతలు శింగనమల రమేశ్, కళ్యాణ్ సహకరించినట్లు భాను చెప్పినట్లు తెలుస్తోంది. పదిహేను నెలలపాటు రూ.4 లక్షలతో జీవించానని విలాసవంతమైన జీవితాన్ని వదిలేయాల్సి వచ్చిందని కూడా చెప్పాడట. అద్దెకు ఇల్లు తీసుకొని, స్వయంగా వండుకుని తినేవాడినని బస్సులు, రైళ్లు, ఆటోల్లోనే తిరిగానని తెలిపాడు. విచారణ సందర్భంగా భాను కిరణ్ ఒక్కో పోలీస్ అధికారితో ఒక్కో విధంగా చెబుతున్నాడట.