రాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు తటస్థం?
ప్రణబ్ ముఖర్జీ విషయంలో తటస్థంగా ఉండడమే పార్టీ మేలు చేస్తుందని చంద్రబాబు ప్రస్తుతం భావిస్తున్నట్లు చెబుతున్నారు. పిఎ సంగ్మాకు బిజెపి మద్దతు ఇస్తుండడంతో అటు వైపు చూడడానికి చంద్రబాబు ఇష్టపడడం లేదని అంటున్నారు. బిజెపితో గత స్నేహం పార్టీకి నష్టం చేసిందని ఆయన చాలా కాలం క్రితమే ఓ నిర్ధారణకు వచ్చింది. దీంతో బిజెపికి సాధ్యమైనంత దూరంగా ఉండడానికి ఆయన నిర్ణయించుకున్నారు. బిజెపి మద్దతు పొందిన సంగ్మాకు ఓటేస్తే మైనారిటీలు దూరమవుతారనే అనుమానాలు కూడా చంద్రబాబుకు ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, ఉప రాష్ట్రపతిగా యుపిఎ హమీద్ అన్సారీ పేరును ఖరారు చేస్తే మాత్రం ఆయనకు మద్దతు ఇవ్వాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు చెబుతున్నారు. మైనారిటీలకు చెందిన ప్రతినిధిగా అన్సారీకి మద్దతు ఇస్తే తమ పట్ల మైనారిటీలు సానుకూలంగా వ్యవహరిస్తారని చంద్రబాబు అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ప్రతిపక్ష బిజెపి తన అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా వుంటే, వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రణబ్ ముఖర్జీకి ఓటేయాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మాత్రం రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలనే ఆలోచన సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఈ నెల 19వ తేదీన జరగనుంది.