పరకాల: కొండా సురేఖ గట్టెక్కుతారా?
ఇరు పార్టీలో ఎవరికి మద్దతివ్వాలనే విషయంపై తెలంగాణ జెఎసి ఇరకాటంలో పడిన నేపథ్యంలో విజయచంద్రా రెడ్డి ఎంపిక వ్యూహాత్మకంగానే జరిగిందని అంటున్నారు. ఆయన తెలంగాణ వైద్యుల జెఎసి నాయకుడిగా ఉన్నారు. తద్వారా తెలంగాణ జెఎసి మద్దతు కూడగట్టవచ్చునని బిజెపి భావించినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన వైద్యులు ఆయన కోసం పనిచేస్తారనే అభిప్రాయం కూడా బిజెపి నాయకుల్లో ఉండవచ్చు. తెరాస బిక్షపతిని పోటీకి దించింది. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు.
తెలంగాణవాదానికి చెందిన ఓట్లు బిజెపి, తెరాస మధ్య చీలిపోయి కొండా సురేఖ బయటపడతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, తమకు 52 శాతం ఓటర్ల మద్దతు ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అంటున్నారు. చాలా ముందు నుంచే తెరాస నాయకులు పరకాలలో మకాం వేసి ప్రచారం సాగిస్తున్నారు. బిజెపిని ఎట్టి పరిస్థితిలోనూ ఓడించే ఉద్దేశంతో తెరాస ఉండగా, మహబూబ్నగర్ విజయాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో బిజెపి ఉంది.
కాంగ్రెసు పార్టీ సమ్మారావును బరిలోకి దించింది. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెసు పార్టీలో చేరారు. అయితే, ఆ సీటును డిసిసి అధ్యక్షుడు గండ్ర వెంకటరమణా రెడ్డి తన భార్య జ్యోతికి ఆహ్వానించారు. తన భార్యకు టికెట్ రాకపోవడంతో వెంకటరమణా రెడ్డి అసంతృప్తితో ఉన్నారని, అది తెరాసకు లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పాటు లోకసత్తా కూడా పోటీలో ఉన్నాయి. దీంతో పరకాలలో బహుముఖ పోటీ హోరాహోరీ జరిగే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి పరకాల వెళ్లారు. అయితే, గాలి దుమారానికి సభా వేదిక కూలిపోవడంతో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడి వచ్చారు. బిసిల ఓట్లు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయి. కొండా సురేఖకు నియోజకవర్గంలో గట్టి పట్టే ఉంది. అయితే, ఆమెకు ఎంత కరుడు గట్టిన అనుచరులున్నారో, అదే స్థాయిలో ప్రత్యర్థులున్నారు. అయినా, ఆమె తెలంగాణవాదం ఓట్లు చీలి గట్టెక్కుతారని ఇప్పటికిప్పటి అంచనాలు తెలియజేస్తున్నాయి.