మాచర్ల: సెంటిమెంట్తో 'జగన్' ఢీ, చిరు నిలబెట్టేనా?
ఈ ఎన్నికల్లో పిన్నెల్లికి ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున బాబాయ్, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మా రెడ్డి నిలిచారు. నిన్న మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ... వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితే ఉండేది. ఇప్పుడు వీరే పోటీలో ప్రధాన ప్రత్యర్థులుగా నిలవడంతో పోటీ రసకందాయంలో పడింది. వైయస్సార్ కాంగ్రెస్కు ప్రధాన బలంగా భావిస్తున్న రెడ్డి సామాజిక వర్గం ఓట్లను చీల్చే సత్తా ఉన్న లక్ష్మా రెడ్డి, మిగతా వర్గాల అండతో విజయం సాధించగలననే ధీమాతో ప్రచారం కొనసాగిస్తున్నారు.
ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చేరికతో కాపు ఓట్లపై ప్రధానంగా ఆశలు పెట్టుకున్నారు. జగన్ అరెస్టు అనంతరం నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు మరింత హుషారుగా పని చేస్తున్నారు. ఇక తెలుగుదేశం తరఫున మాజీ ఐపిఎస్ అధికారి చిరుమామిళ్ళ వెంకట నర్సయ్య కుమారుడు మధు బాబును రంగంలోకి దించారు. తొలుత నర్సయ్యనే అభ్యర్థిగా నిలపాలని భావించినప్పటికీ... యువతకు ప్రాధాన్యం ఇచ్చినట్టు ఉంటుందని ఆయన కుమారుడి వైపు మొగ్గు చూపారు.
స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన నర్సయ్య... పదవీ విరమణ అనంతరం టిడిపికి దగ్గరయ్యారు. చాలా ఏళ్ల తర్వాత ఆ నియోజకవర్గం నుంచి కమ్మ సామాజిక వర్గానికి పోటీ చేసే అవకాశం రావడంతో... వారంతా కలసికట్టుగా పని చేస్తున్నారు. బిసిల ఓట్లపైనా ఆశలు పెట్టుకున్నారు. జగన్ అవినీతి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అక్రమాలపై గురి పెట్టి ప్రచారం చేస్తున్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండు పర్యాయాలు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.
2004కు పూర్వం నియోజకవర్గంలో పార్టీకి ఉన్న వైభవాన్ని తిరిగి దక్కించుకోవాలని ఆ పార్టీ నేతలు విశేషంగా కృషి చేస్తున్నారు. దీంతో మూడు పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ జరుగుతున్నది. మొత్తంగా చూస్తే... బిసిలు ఎటువైపు మొగ్గు చూపుతారన్న దాని పైనే అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడ మాల (11 వేలు), రెడ్డి (25 వేలు) జగన్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు అంచనా వేస్తున్నారు. బిసిలలో అత్యధిక సంఖ్యాకులు తెలుగుదేశం పార్టీ వైపు నిలిచినట్లు భావిస్తున్నారు. కాపులు (17 వేలు) అత్యధికంగా కాంగ్రెస్ పక్షమే అని చెబుతున్నారు.