కాంగ్రెసు, టిఆర్ఎస్లకు 'మహబూబ్నగర్' చిక్కులు
మీ నిర్ణయం కాంగ్రెసు, టిడిపిలకు లబ్ధి చేకూరుస్తుందని కాబట్టి వెనక్కి తగ్గాలని టిఆర్ఎస్ బిజెపిని విజ్ఞప్తి చేస్తోంది. అయితే అభ్యర్థి విషయంలో మార్పులు చేర్పులు ఉంటే తప్ప తాము వెనక్కి తగ్గేది లేదని బిజెపి ఖరాఖండిగా చెబుతోందట. దీంతో టిఆర్ఎస్కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మరో విషయమేమంటే టిఆర్ఎస్ చీఫ్ కె చంద్రశేఖర రావు ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంటు స్థానంలోనే మహబూబ్ నగర్ ఉంది. దీంతో మిగిలిన సీట్ల కంటే ఈ సీటు టిఆర్ఎస్కు ప్రతిష్టాత్మకం. ఇక్కడ భారీ మెజార్టీతో గెలవాలనే ఉద్దేశ్యంతో మైనార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపారు. కానీ బిజెపి నిర్ణయం వారికి షాక్ ఇచ్చింది. బరిలో నిలవవద్దని టిఆర్ఎస్ ఎంతగా విజ్ఞప్తి చేసినప్పటికీ బిజెపి మాత్రం అభ్యర్థి విషయంలో మీరు తగ్గితేనే మేం పునరాలోచిస్తామను కుండబద్దలు కొడుతోందట. విజయలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకుందామన్న బిజెపి సూచనను టిఆర్ఎస్ పక్కన పెట్టడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కేవలం బిజెపియే కాదు టిఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థిని స్థానిక టిఆర్ఎస్ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారట. దీంతో ఇప్పుడు టిఆర్ఎస్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. అభ్యర్థిపై వెనక్కి తగ్గితే ఓ రకంగా, వెనక్కి తగ్గకపోతే మరోరకంగా నష్టం.
కాంగ్రెసునూ ఇదే నియోజకవర్గంలో ఎక్కువ కష్టాలు వెంటాడుతున్నాయి. దివంగత ఎమ్మెల్యే రాజశ్వర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మికి టిక్కెట్ కేటాయించేందుకు కాంగ్రెసు నిర్ణయానికి వచ్చింది. అయితే విజయలక్ష్మి అభ్యర్థిత్వాన్ని మిగిలిన నేతలు వ్యతిరేకిస్తున్నారు. పార్టీ తరఫున ఆమెకే టిక్కెట్ కేటాయించిన పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా మరొకరిని రంగంలోకి దింపేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా మంత్రి డికె ఆరుణ మద్దతు కూడా అభ్యర్థిని వ్యతిరేకిస్తున్న వారికే ఉందని సమాచారం. స్వతంత్ర అభ్యర్థిగా మరో కాంగ్రెసు నేత బరిలోకి దిగితే పార్టీ ఓట్లు చీలి భారీ నష్టం వాటిల్లుతుందని అధికార పార్టీ భయపడుతోంది. విజయలక్ష్మి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారు మాత్రం వెనక్కి తగ్గటం లేదని సమాచారం.