కుటుంబాల పొలిటికల్ వార్: కొత్తగా కెసిఆర్కూ
ఇటీవల వాన్పిక్ కుంభకోణంలో సిబిఐ చార్జిషీటు ఎదు ర్కొని మంత్రి పదవికి రాజీనామా చేసి, ముఖ్యమంత్రి నిర్ణ యం కోసం ఎదురు చూస్తున్న ఉత్తరాంధ్ర సీనియర్ నేత ధర్మాన ప్రసాద రావు ఆ ప్రాంతంలో ఇంకా కాంగ్రెస్లో చక్రం తిప్పుతున్నారు. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ మాత్రం వైయస్సార్ కాంగ్రెస్లో చేరిపోయారు. ఇటీవల నరసన్నపేట నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కృష్ణదాస్ ఓటమికి ధర్మాన చాలా సీరియస్గా కృషి చేశారు. మరో సోదరుడు ధర్మాన రాందాస్ను కాంగ్రెస్ తరఫున బరిలో దించి అన్నీ తానై ప్రచారం చేశారు.
అయినప్పటికీ విజయం కృష్ణదాస్ను వరించింది. రాజకీయంగా సోదరులిద్దరూ రెండు పార్టీలలో ఉన్నప్పటికీ, కుటుంబపరంగా జరిగే కార్యక్రమాలకు మాత్రం కలుసుకుంటున్నారు. ఆ మధ్య ధర్మానపై ఆరోపణలు వచ్చినప్పుడు కృష్ణదాస్ అప్పట్లో మంత్రిగా ఉన్న ప్రసాద రావు చాంబర్కు వెళ్ళి మంతనాలు జరపటం విశేషం. ఇక టిడిపిలో పార్టీ ముఖ్య నేతకే ఫ్యామిలీ నుండి ఇక్కట్లు ఉన్నాయి. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పని చేస్తుంటే ఆయన వదిన, స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధీశ్వరి కాంగ్రెస్ మంత్రిగా కేంద్రంలో ఒక వెలుగు వెలుగుతున్నారు. ఇక ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి సొంత పార్టీ పెట్టినప్పటికీ వైయస్సార్ కాంగ్రెసుకు సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీ కార్య క్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
తెలుగుదేశం పార్టీలోనే బావా బావమరదులైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వేర్వేరు పార్టీలలో ఉన్నారు. సోమిరెడ్డి తెలుగుదేశం పార్టీలో క్రియాశీల నాయకుడుగా చెలామణి అవుతుంటే, ఆయన బావమరిది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్లో ముఖ్య నేతగా ఉన్నారు. విశేషం ఏమిటంటే ఇటీవల కోవూరు నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికలో వీరిద్దరూ ముఖాముఖి తలపడ్డారు.
ఇక తెలంగాణ రాష్ట్ర సమితిలోనూ ఇటీవలి కాలంలో బంధుగణం మధ్య విభేదాలు పెరిగిపోయాయి. కెసిఆర్, ఆయన కుమార్తె, కుమారుడు, మేనల్లుడు హరీశ్ రావు టిఆర్ఎస్లో కొనసాగుతుంటే, మరో మేనల్లుడు, సోదరి కుమారుడు ఉమేశ్రావు పిసిసి అధికార ప్రతినిధిగా ఉన్నారు. కెసిఆర్కూ, ఉమేశ్కూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్మించుకున్న తెలంగాణ భవన్లో ఒక ఎలక్ట్రానిక్ మీడియాను నడిపిస్తున్నారని, వాణిజ్య ప్రయోజనాలకు వాడుకుంటున్నారని, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలంటూ ఉమేశ్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దానిపై విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది కూడా. ఇక కెసిఆర్ స్వయంగా కాళ్ళు కడిగి కన్యా దానం చేసిన సోదరుడు రంగారావు కుమార్తె రమ్యా మధుసూదన్ రావు తాజాగా మరో కొత్త పార్టీలోకి చేరిపోయారు. రాష్ట్రీయ లోక్దళ్ అధినేత, కేంద్ర మంత్రి అజిత్ సింగ్ ఇటీవల స్థాపించిన తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఆమె నియమితులైతే భర్త మధుసూదన్ రావు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.