వారిద్దరికీ దగ్గుబాటి పురంధేశ్వరే అడ్డు
ఎన్టీ రామారావు కూతురు అయిన దగ్గుబాటి పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీని కాదని, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో విభేదించి పార్టీలోకి రావడం కాంగ్రెసు పార్టీకి ఎంతగానో ఉపయోగించిందని అంటున్నారు. ఆమెతో పాటు ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు శాసనసభ్యుడిగా ఉన్నారు. రాష్ట్రంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు మంత్రి పదవి ఇవ్వకుండా ఎన్టీ రామారావు కూతురిగా తమ పార్టీ ప్రయోజనాలకు ఉపకరిస్తుందనే ఉద్దేశంతో దగ్గుబాటి పురంధేశ్వరికి కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చారు.
కేంద్ర మంత్రి పదవి నుంచి ఆమెను తప్పించే అవకాశాలు లేవు. పైగా, ఆమె పనితీరు పట్ల ప్రధాని మన్మోహన్ సింగ్ సంతృప్తితో ఉన్నారు. ఈ స్థితిలో పురంధేశ్వరి సామాజిక వర్గానికే చెందిన కావూరి సాంబశివరావుకు మంత్రి పదవి లభించే అవకాశాలు లేకుండా పోయాయి. అదే విధంగా రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిపై అధిష్టానానికి విశ్వాసం ఉంది. ఆ కారణంగానే ఆమెను ఎఐసిసి అధికార ప్రతినిధిగా నియమించారు.
రేణుకా చౌదరి పురంధేశ్వరి సామాజిక వర్గానికి చెందినవారే. దాంతో ఆమె పేరు మంత్రి పదవికి పరిశీలనకు వచ్చినప్పటికీ ఫలితం లభించకపోవచ్చునని అంటున్నారు. ఒకవేళ, ఆ సామాజిక వర్గానికి మరో పదవి ఇద్దామని అనుకున్నా, కావూరి సాంబశివరావు, రేణుకా చౌదరిల్లో ఎవరికి ఇవ్వాలనేది కూడా పార్టీ అధిష్టానానికి సమస్యగానే తయారైంది. దీంతో ఇరువురిని పక్కన పెట్టాలనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు.
కల సమీకరణలో రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి మంత్రి పదవి ఇవ్వడానికి ఏ విధమైన ఆటంకాలు లేవు. పైగా, చిరంజీవి సామాజిక వర్గాన్ని కాంగ్రెసు అధిష్టానం ఇప్పుడు పార్టీకి ఆయువుపట్టుగా భావిస్తోంది. అదే సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణను పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కారణంగా రెడ్లు పార్టీ దూరమవుతున్న స్థితిలో చిరంజీవి సామాజిక వర్గానికి చెందిన ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో కాంగ్రెసు అధిష్టానం ఉంది. దీంతో కాపు వర్గానికి పార్టీలో ప్రాధాన్యాన్ని పెంచుతోంది.
కమ్మ సామాజిక వర్గానికి రెండు మూడు మంత్రి పదవులు ఇచ్చే పరిస్థితిలో కాంగ్రెసు అధిష్టానం లేదు. దీంతో పురంధేశ్వరిని కొనసాగించడం తప్ప ఆ సామాజిక వర్గానికి చెందిన మరొకరికి మంత్రి పదవి ఇచ్చే స్థితిలో కాంగ్రెసు అధిష్టానం సిద్ధంగా లేదని అంటున్నారు.