జగన్ కంపెనీల్లో పెట్టుబడి: 'భారతి'కి లాభాలు
వాన్పిక్ నుంచి భూముల కొనుగోలు నిమిత్తం వచ్చిన సొమ్మును ఆయన... జగన్ కంపెనీల్లోకి పెట్టుబడుగులుగా తరలించినట్లుగా బయటపడుతోంది. వాన్పిక్ పెట్టుబడులకు సంబంధించి అన్ని వ్యవహారాల్లోనూ నిమ్మగడ్డనే నిర్ణయాలు తీసుకునే వారని, ఇందులో కంపెనీ డైరెక్టర్ల పాత్ర ఏమీ ఉండేదని కాదని తెలుస్తోంది. దాదాపు 20 కంపెనీల డైరెక్టర్లకు ఇస్తున్నట్లు చూపిన జీత భత్యాలన్నీ కాగితాలకే పరిమితమని రాజు సిబిఐకి తెలిపారు.
జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ ఆయన నుంచి గతంలో వాంగ్మూలం తీసుకుంది. వాంగ్మూలం ప్రకారం.. 'నిమ్మగడ్డ 21 కంపెనీలు నడిపారు. అందులో జీ2 కార్పొరేట్ సర్వీసెస్ లిమెటెడ్ ఒకటి. అందులో తప్ప మిగతా 20 కంపెనీల్లో ఎలాంటి వ్యాపార వ్యవహారాలు జరగలేదు. ఆ సంస్థల్లో ఖాతా పుస్తకాలు కూడా లేవు. సొంత నిర్ణయాలు తీసుకోగలిగే డైరెక్టర్లు ఎవరూ లేర' అని చెప్పారు.
అసలా కంపెనీల్లో ఉద్యోగులే లేరని తేల్చి చెప్పారు. దీంతో ఆయా కంపెనీలన్నీ సూట్కేస్ కంపెనీలని, జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు పెట్టడానికే వాటిని సృష్టించారన్న సిబిఐ వాదనకు బలం చేకూరింది. తాను 2007 డిసెంబర్ 6న జీ2 కార్పొరేట్ సర్వీసెస్లో మేనేజర్గా చేరానని, అంతకుముందు ఆడిటర్లు ఎవరూ ఖాతా పుస్తకాల విషయంలో నియమాలు పాటించలేదని, తాను సరిదిద్దేందుకు ప్రయత్నించానని ఆయన చెప్పారు.
కంపెనీ సలహాదారైన మారుతీ నాగేంద్రమే జనరల్ ఓచర్లను గ్రూపులోని ఇతర కంపెనీలకు పంపేవారని, నిమ్మగడ్డకు చెందిన కంపెనీలన్నీ జీ2 గ్రూప్గా వ్యవహరించే వారని చెప్పారు. ఇందులో కొన్ని కంపెనీలు ఇతర సంస్థల్లోకి భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ, వాటికి సంబంధించిన లెక్కలేవీ చూపలేదన్నారు. అలాంటి వాటిలో అల్ఫా, బీటా పేర్లతో ఉన్న కంపెనీలు ముఖ్యమైనవన్నారు.
భారతి సిమెంట్స్లో నిమ్మగడ్డ 2007లో పెట్టిన రూ.67 కోట్ల పెట్టుబడులకు 2010లో రూ.365.41 కోట్ల లాభం వచ్చిందని, దీనిలోంచి రూ.350 కోట్లను ఆయన వెంటనే జగతిలోకి మళ్లించారని తెలిపారు. 2008-09 కాలంలో ఒక్కో షేరుకు రూ.1450 ధరతో భారతి సిమెంట్స్లో రూ.210 కోట్లు పెట్టుబడులు పెట్టారని, దీన్లో నిమ్మగడ్డ రూ.112.79 కోట్లు నష్టపోయారని వెల్లడించారు.
ఒక కంపెనీ పేరుతో పెట్టుబడులు పెట్టి, వేరే కంపెనీ పేరును పుస్తకాల్లో రాశారని వివరించారు. 2008 జులైలో వాన్పిక్ నుంచి జి2 కంపెనీలోకి రూ.150 కోట్లు వచ్చాయని, ఇవి సంస్థ స్థిరాస్తులకు సంబంధించినవిగా నిమ్మగడ్డ చెప్పారని, డైరెక్ట్టర్ హోదాలో ఆయనే వాటిపై సంతకాలు చేశారన్నారు. వాన్పిక్ దాని అనుబంధ సంస్థల్లోకి నేరుగాను, కొన్ని కంపెనీల పేర్లతోనూ భారీగా నిధులు వచ్చాయన్నారు. వాటిని నిమ్మగడ్డనే పర్యవేక్షించే వారని చెప్పారు.
కారిడార్, పోర్టుల భూమిని కొనుగోలు చేసేందుకుగాను వాన్పిక్ గ్రూప్ కంపెనీల నుంచి 2008 నుంచి 2010 మధ్య సాంగ్రియా బిల్డర్స్కు రూ.91.50 కోట్లు, సుగుణి కన్స్ట్రక్షన్స్కు రూ.91.50 కోట్లు, సీయానా కన్స్ట్రక్షన్స్కు రూ.95.72 కోట్లు కలిపి మొత్తం రూ.278.72 కోట్ల చెల్లింపులు జరిగాయని వివరించారు. ఈ మొత్తంలోంచి నిమ్మగడ్డ రూ.160 కోట్లను జగన్ కంపెనీల్లోకి తరలించారన్నారు.
పేట్ బషీరాబాద్, అసిల్ మిట్టల్లోని తన భూములతో పాటు భారతి సిమెంట్సులో వాటాల విక్రయం ద్వారా వచ్చిన మొత్తంలోంచి వైయస్సార్ ఫౌండేషన్కు రూ.7 కోట్లు విరాళంగా ఇచ్చారని తెలిపారు. జి2 సంస్థలో తాను మేనేజర్గా చేరక ముందు, జి2 గ్రూప్లో ఒకటైన బీటా అవెన్యూస్ సంస్థ జగన్కు చెందిన కార్మెల్ ఏషియా హోల్డింగ్స్లోకి 2007లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించానని సిబిఐకి సత్యనారాయణ తెలిపారు.
రూ.10 విలువ కలిగిన షేరును రూ.252 ప్రీమియంతో లెక్కించి రూ.20 కోట్ల విలువైన పెట్టుబడులను కార్మెల్ ఏషియాలోకి మళ్లించారని, అలాగే జగన్కే చెందిన సిలికాన్ బిల్డర్స్లోకి 2008 జనవరి-మే మధ్య జి2 నుంచి రూ.57 కోట్లు పెట్టుబడిగా వెళ్లాయని చెప్పారు.