కెసిఆర్ ఏం చేస్తారు, ఢిల్లీలోనే ఉంటారా?
గత ఇరవై రోజుల నుండి ఢిల్లీలో మకాం వేసిన చంద్రశేఖరరావు తెలంగాణ కవాతుకు దూరంగా ఉండిపోయారు. కాంగ్రెస్ అధినాయకత్వం అసలు రంగు బయట పడటంతో ఆయన ఇప్పుడు హైదరాబాద్కు వెళ్లిపోయి కవాతులో పాల్గొనే స్థితి కూడా లేకుండా పోయింది తెలంగాణ జెఏసి నాయకులు ఇంతవరకు కెసిఆర్తో సంబంధం లేకుండానే కవాతు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, చివరకి తెరాస తెలంగాణ మార్చ్కు మద్దతు తెలపడం ద్వారా కాస్తా బయటపడే మార్గాన్ని పట్టింది.
తెలంగాణ కవాతుకు దూరంగా ఉండిపోతే చంద్రశేఖరరావు రాజకీయంగా ఏకాకి అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. తెలంగాణవాది కొండా లక్ష్మణ్ బాపూజీ అంత్యక్రియలకు కూడా హాజరు కాకపోవడం కూడా విమర్శలకు దారి తీసింది. ఇప్పుడు ఎకాకిన వచ్చి ఆయన తెలంగాణ మార్చ్లో పాల్గొంటారని చెప్పలేం. ఆయన ఢిల్లీలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈ మధ్య కాలంలో హైదరాబాదు తిరిగి వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు.
అయితే, కెసిఆర్ మాత్రం అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లే అర్థమవుతోంది. కేంద్ర మంత్రి వాయలార్ రవి బుధవారం చేసిన ప్రకటన కాస్తా కెసిఆర్కు ఊరట కలిగించింది. జాతీయ సమస్యల వల్ల తెలంగాణపై దృష్టి పెట్టలేకపోయామని ఆయన అన్నారు. కెసిఆర్తో తాను మాట్లాడుతున్న విషయాన్ని కూడా ఆయన ధ్రువీకరించారు.
తెలంగాణపై కెసిఆర్తో చర్చలు జరిపే ఉద్దేశంతోనే కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మరో 15 రోజుల తర్వాత చర్చలను పునరుద్ధరించవచ్చునని అంటున్నారు. అయితే, కాంగ్రెసు అధిష్టానం మాటలను నమ్మడానికి వీలు లేదనే వాదన తెలంగాణవాదుల నుంచి గట్టిగానే వినిపిస్తోంది. మొత్తం మీద, కెసిఆర్ ముందుకు రాలేక, వెనక్కి పోలేక ఇరకాటంలో పడినట్లు చెబుతున్నారు.