ధర్మాన రాజీనామా ఆమోదం తప్పదా?
జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ నాలుగో చార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంత్రి పదవిలో ఉంటూ అక్రమాలకు సంబంధించిన నిందితునిగా విచారణ నిమిత్తం న్యాయస్థానం ఎదుట హాజరు కావడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న వస్తోంది. వాన్పిక్ వ్యవహారంలో ధర్మానపై అభియోగాన్ని మోపిన సిబిఐ ఆయనను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. తన పేరును సిబిఐ చార్జిషీట్లో చేర్చడంతో నైతిక బాధ్యత వహిస్తూ ధర్మాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, దాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నెల రోజులుగా పెండింగులో పెట్టారు.
ధర్మాన రాజీనామా వ్యవహారంపై ముఖ్యమంత్రి అధిష్ఠానంతో చర్చించారు. ఈ వ్యవహారంపై నిర్ణయాధికారాన్ని ముఖ్యమంత్రికే అధిష్ఠానం విడిచిపెట్టింది. ఢిల్లీ పర్యటన తర్వాత ధర్మాన అంశంపై సీఎం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని భావించారు. అయితే,స అభియోగ పత్రంపై సిబిఐ కోర్టు స్పందించిన తీరును పరిశీలించాకే ధర్మాన విషయంలో సీఎం ఒక నిర్ణయానికి వస్తారని అప్పట్లో పార్టీ ముఖ్య నేతలు చెప్పారు.
సిబిఐ చార్జిషీటును కోర్టు పరిగణనలోకి తీసుకుని సమన్లు జారీ చేసిన నేపథ్యంలో, ధర్మాన నుంచి వివరణ కోరతారా? లేక రాజీనామాపై నేరుగా నిర్ణయం తీసుకుంటారా? అనే చర్చ సాగుతోంది. రాజీనామాను ఆమోదించక తప్పదని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. కాగా, ధర్మానపై నమోదు చేసిన క్రిమినల్ శిక్షాస్మృతినే పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు ప్రా సిక్యూషన్కు అనుమతి లేకపోవడంతో అవినీతి కేసుల జోలికి వెళ్లలేదు. దీంతో ప్రాసిక్యూషన్ విషయంలో ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చే వీలుందని కొందరు కూడా అంటున్నారు.
అయితే.. ప్రాసిక్యూషన్ విషయంలో ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న మరో మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ కొనసాగిన 'వేచి చూసే ధోరణే' మున్ముందూ కొనసాగుతుందని వివరించారు. ధర్మాన విషయంలో తాజా పరిణామాన్ని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా సునిశితంగానే గమనిస్తున్నారు.
ఈనెల 17 నుంచి శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడం కూడా పాలకపక్షానికి శిరోభారంగా మారింది. సమావేశాలు సజావుగా జరుగుతాయా లేదా అనే అంశాన్ని పక్కనపెడితే, ఈ అంశంపైనే ప్రతిపక్షాలు మాట్లాడితే కాస్త ఇబ్బందేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏమైనా, ధర్మాన రాజీనామాపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోక తప్పదని అంటున్నారు.