సదానందకు చెక్: ఢిల్లీలో చక్రం తిప్పుతున్న యడ్డీ
ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిపై కన్నేసిన యడ్యూరప్ప ఈ దిశలో చక్రం తిప్పేందుకు వచ్చారని ఈ వర్గాలు అంటున్నాయి. అందుకు తగ్గట్టు యడ్యూరప్ప ఢిల్లీలో సీనియర్ నేత అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. దీంతో ఆయన ప్రత్యర్థి వర్గానికి యడ్యూరప్ప ఢిల్లీ పర్యటనను ఆసక్తిగా గమనిస్తోంది. మరోవైపు తమకు కీలక మంత్రిత్వ శాఖలు కట్టబెట్టాల్సిందేనంటూ మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ శిబిరం వేసిన వ్యూహాలను తిప్పికొట్టేందుకు కూడా అప్ప ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
మైనింగ్ కేసు చుట్టుకోవడంతో యడ్యూరప్ప పదవి నుండి తప్పుకునే పరిస్థితి వచ్చినప్పుడు గత సంవత్సరం సదానందకు ఆ పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని డిమాండ్ చేసి నెగ్గించుకున్నారు. అయితే ఆ తర్వాత వారిద్దరి మధ్య పొరపొచ్చలు రావడంతో సదానందను దింపి తాను సూచించిన వారికే పట్టం కట్టాలని యడ్డీ మళ్లీ పేచీ పెట్టడంతో అతను సూచించిన జగదీష్ శెట్టార్కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు.
సదానంద మాత్రం తాను గద్దె దిగేందుకు అధిష్టానానికి పలు కండిషన్స్ పెట్టారు. వాటిలో కొన్నింటికి అధిష్టానం అంగీకరించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అందులో తనకు రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టడం, తన వర్గం ఎమ్మెల్యేలకు కీలకమైన శాఖలు శెట్టార్ కేబినెట్లో ఇవ్వడం వంటి కండిషన్స్ పెట్టారు. ఇప్పుడు యడ్డీ సదానందకు అధ్యక్ష పదవి దక్కకుండా అది తనకు దక్కేలా, దాంతో పాటు సదానంద వర్గానికి కీలక శాఖలు దక్కకుండా ఢిల్లీలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.