పైచేయి ఎవరిదో?: చిరంజీవి మంత్రికి కిరణ్ వార్నింగ్
డిఎల్ను బర్తరఫ్ చేసిన ముఖ్యమంత్రి వీరిద్దరిని కూడా తొలగించేందుకు అధిష్టానాన్ని కోరి ఉంటారని, అయితే అనుమచ్చిందా లేదా అన్నదే తెలియాల్సి ఉందంటున్నారు. తొలగింపు పేర్లలో డిఎల్తో పాటు సి రామచంద్రయ్య పేరు మాత్రం ఖచ్చితంగా ఉంటుందనే చెప్పవచ్చు. రామచంద్రయ్య తొలగింపుకు కిరణ్ పట్టుబట్టినా అందుకు చిరు ఒప్పుకుంటేనే అధిష్టానం అంగీకరిస్తుందని చెబుతున్నారు.
రామచంద్రయ్య పలు సందర్భాలలో కిరణ్తో విభేదించారు. ఇటీవల విద్యుత్ తదితర సమస్యలపై విమర్శనాత్మకంగా వ్యవహరించడమే కాకుండా చిరును ముఖ్యమంత్రిగా ఎలివేట్ చేస్తూ కిరణ్కు ఆగ్రహం తెప్పిస్తున్నారు. మంత్రివర్గం కూర్పు సమయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించిన, ఇటీవల అవిశ్వాస తీర్మానం సమయంలో ఓటింగ్కు గైర్హాజరైన వట్టి విషయంలోనూ కిరణ్ అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వీరిద్దరినీ ఇప్పటికిప్పుడే తప్పిస్తారా లేక మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో డ్రాప్ చేస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. రామచంద్రయ్యను చిరంజీవి ఏ మేరకు కాపాడుకుంటారనేది చర్చనీయాంశమైంది. ఆయనను కాపాడుకుంటే కిరణ్ పైన అధిష్టానం వద్ద చిరుదే పైచేయి అవుతుంది. వట్టి వసంత్ కుమార్ను తప్పించడంపై కూడా జోరుగా ప్రచారం సాగుతున్న ఆయనను ఇప్పటికిప్పుడు తొలగించక పోవచ్చునని కూడా అంటున్నారు.
చిరు అండ ఉన్న రామచంద్రయ్యతో పాటు వట్టిలకు డిఎల్ తొలగింపు ఓ హెచ్చరికగా కూడా కావొచ్చునని అంటున్నారు. మరోవైపు మంత్రి పదవి కోసం జెసి దివాకర్ రెడ్డి, వీరశివా రెడ్డి, గాదె వెంకట రెడ్డిలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రామచంద్రయ్యను తొలగిస్తే కొత్తపల్లి సుబ్బారాయుడి పేరు, ఎమ్మెల్సీ చెంగల్రాయుడి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు సీనియర్ నేతలు అయిన డి.శ్రీనివాస్, షబ్బీర్ అలీలకు కూడా మంత్రి పదవులు తప్పక పోవచ్చునని అంటున్నారు.