లెఫ్ట్ 'విభజన': నారాయణ వర్సెస్ రాఘవులు
మార్క్సిజం జడపదార్థం కాదంటే మార్క్సిజం కూడా అవకాశవాదమనేంత దూరం కూడా సిపిఎంవారు వెళతారేమో తెలియదని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ 'అశ్వత్ధామ హతఃకుంజర' అన్న పద్ధతుల్లో సమైక్యతే తమ నినాదమని చెప్పుకుంటోందన్నారు. తమ విధానం తాము చెప్పామని, మీ ఇష్టం మీదన్నారు. ప్రత్యేకవాదుల వద్దకు వెళ్లి తాము విభజనకు అడ్డుకాదని చెప్పి పరోక్ష సయోధ్య కుదుర్చుకోలేదా? అని ఆరోపించారు.
సిపిఎం పొలిట్బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి సైతం ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇచ్చిన సందర్భంగా "మా భుజాలపై తుపాకిని పెట్టి పేల్చకండి. మీ నిర్ణయం మీరు తీసుకోండి'' అని చెప్పారన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగినంతకాలం మౌనంగా ఉన్న సిపిఎం పర్యటనలకే పరిమితమైందని ఆయన విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా సిడబ్ల్యూసి ప్రకటన చేశాక రాఘవులు చేసిన పత్రికా ప్రకటన ప్రజలకు తెలుసునని, సమైక్యాంధ్ర ఉద్యమం బలపడే కొద్దీ క్రమంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో హడావిడిగా పర్యటనలు నిర్వహిస్తోందన్నారు.
సమైక్యతకు తామొక్కళ్లమే మొనగాళ్లమని ప్రకటించుకుంటూ సిపిఐ, ఇతర ప్రజా సంఘాలపై విషంగక్కే ప్రసంగాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సిపిఐ కోరడంలో కేవలం తెలంగాణ సెంటిమెంటే ప్రధానం కాదని, దాన్ని ఒక అంశంగా మాత్రమే పరిగణించిందని నారాయణ వివరణ ఇచ్చారు. 1969, 1972లలో సిపిఐ కూడా సమైక్య రాష్ట్రం కోసం వీధి పోరాటాలనుసైతం చేసిందని గుర్తు చేశారు.
ఆనాడు కూడా సిపిఎంది సమైక్యవాదమేనని, అయితే ప్రకటనలు చేసి మౌనపాత్ర వహించిందే గానీ.. తమలాగా ధైర్యంగా నిలబడలేదన్నారు. కాలక్రమంలో తమ ప్రతిపాదనలను పాలకవర్గాలు బుట్టదాఖలా చేయడం, ప్రజల్లో అసంతృప్తి జ్వాల పెరగడంతో సిపిఐగా రాజకీయ నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణలో సన్నాయినొక్కులు, కోస్తాంధ్రలో సింహగర్జనలు చేసే సిపిఎం గురించి అందరూ తెలుసుకుంటారన్నారు.