బొత్స మాటే దినేష్ రెడ్డి: కిరణ్ రెడ్డికి షాక్ (ఫోటోలు)
హైదరాబాద్: నక్సలైట్ల వాదనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే నక్సలైట్ సమస్య పెరుగుతుందని కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 12వ తేదీన జరిగిన కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో చెప్పారు. ఈ విషయం మీడియాకు లీకైంది. అప్పటి నుంచి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెసు నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. మరోవైపు, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆ వాదనతో విభేదించారు.
తెలంగాణ ఇస్తే ఈ ప్రాంతంలో నక్సలైట్ సమస్య పెరుగుతుందనే వాదనను బొత్స సత్యనారాయణ అదే కోర్ కమిటీ సమావేశంలో ఖండించారు. మరోవైపు, తెలంగాణకు చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో విభేదించారు. తాజాగా, పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) దినేష్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. నిజానికి, దినేష్ రెడ్డి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే నక్సలైట్ కార్యకలాపాలు పెరుగుతాయనే వాదనను దినేష్ రెడ్డి ఖండించారు. రాష్ట్ర విభజనపై కసరత్తు చేస్తున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమైన తర్వాత దినేష్ రెడ్డి ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇది ఒక రకంగా కిరణ్ కుమార్ రెడ్డిని షాక్కు గురి చేసే విషయమే.
పటిష్టమైన పోలీసు వ్యవస్థ కారణంగా రాష్ట్రంలో నక్సలైట్ కార్యకలాపాలు చాలా వరకు తగ్గాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే నక్సలైట్ కార్యకలాపాలు పెరుగుతాయనే వాదనకు ఏ మాత్రం ఆధారాలు లేవని, అది ఊహాగానం మాత్రమేనని ఆయన అన్నారు. అయితే, రాష్ట్ర పోలీసు బలగాలను ఆధునీకరించే విషయంపై తాను హోం మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడినట్లు దినేష్ రెడ్డి చెప్పారు. కానీ, రాష్ట్ర విభజన విషయంలో దినేష్ రెడ్డితో హోం మంత్రిత్వ శాఖ అధికారులు మాట్లాడినట్లు తెలుస్తోంది.
నక్సలైట్ల పేరుతో కిరణ్ రెడ్డి టీ వ్యతిరేకత
నక్సలైట్ కార్యకలాపాలపై డిజిపి దినేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎదురు దెబ్బ లాంటివే. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే నక్సలైట్ కార్యకలాపాలు పెరుగుతాయని, మావోయిస్టులు విజృంభిస్తారని కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశానికి తెలిపారు. అందుకు, ఛత్తీస్గడ్, జార్ఖండ్ రాష్ట్రాలను నిదర్శనంగా చూపారు.
ఆ మాటలు ఉత్తవేనని బొత్స
తెలంగాణ ఇస్తే నక్సలైట్ కార్యకలాపాలు పెరుగుతాయనే వాదనతో బొత్స సత్యనారాయణ కోర్ కమిటీ సమావేశంలో అంగీకరించలేదు. మావోయిస్టులు పెరిగే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. అయితే, ఇతర కారణాలు చూపి ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారు.
దామోదర వ్యాఖ్యలు...
తెలంగాణ ఇస్తే నక్సలైట్లు విజృంభిస్తారనే వాదనను ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వ్యతిరేకించారు. తెలంగాణ ఇవ్వకపోతేనే మావోయిస్టులు పెరుగుతారని ఆయన చెప్పారు. తెలంగాణకు చెందిన హనుమంతరావు, పొన్నం ప్రభాకర్ వంటి నేతలంతా కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.
కిరణ్ రెడ్డి మాటే కావూరి వాదన
తెలంగాణ ఇస్తే మావోయిస్టులు పెరుగుతారని కాంగ్రెసు నాయకుడు, కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు మొదటి నుంచీ వాదిస్తున్నారు. చత్తీస్గడ్, జార్ఖండ్ల్లో ఏం జరుగుతోందో నిత్యం చూస్తూనే ఉన్నామని ఆయన అన్నారు. సీమాంధ్ర ఎంపి లగడపాటి రాజగోపాల్ కూడా ఇదే వాదనతో ఉన్నారు.
కిరణ్ రెడ్డికి దినేష్ రెడ్డి షాక్...
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే మావోయిస్టులు పెరుగుతారనే వాదనను డిజిపి దినేష్ రెడ్డి కొట్టిపారేశారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థకు నేతృత్వం వహిస్తున్న డిజిపి మాటలను ఎవరైనా అధికారికంగా తీసుకునే అవకాశం ఉంది. దాంతో కిరణ్ కుమార్ రెడ్డి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లేనని చెప్పాలి.
మావోయిస్టు అగ్రనేతది తెలంగాణనే..
మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతిది తెలంగాణలోని కరీంనగర్ జిల్లానే. పశ్చిమ బెంగాల్లో మరణించిన అగ్రనేత కిషన్జీ కూడా ఈ జిల్లాకు చెందినవారే. ఉత్తర తెలంగాణలోని పలువురు మావోయిస్టు నేతలు దేశవ్యాప్త నక్సలైట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకప్పుడు ఉత్తర తెలంగాణను ఊపిసేన నక్సలిజం ఇప్పుడు తెలంగాణలో తగ్గుముఖం పట్టిందనేది మేధావుల అంచనా.