బొత్స అవుట్: రేసులో ముగ్గురు? (పిక్చర్స్)
హైదరాబాద్: పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణను తప్పించే అవకాశాలున్నాయనే ప్రచారం ఊపందుకుంది. బొత్స సత్యనారాయణ ఉప ముఖ్యమంత్రి పదవి కావాలంటూ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణను తప్పిస్తే ఎవరిని నియమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పిసిసి అధ్యక్ష పదవికి ముగ్గురు నాయకులు రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో ఎవరిని పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తారనేది వారంలో తేలుతుందని అంటున్నారు.
పార్టీ వర్గాల సమాచారం మేరకు - పిసిసి అధ్యక్ష పదవికి పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ (బీసీ), మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (కాపు), మల్లు రవి (ఎస్సీ) రేసులో ఉన్నారు. తెలంగాణ నుంచి ఇవ్వాలనుకుంటే డీఎస్, సీమాంధ్రకు అవకాశం ఇవ్వాలనుకుంటే కన్నా లక్ష్మీనారాయణకు ఆ పదవి దక్కవచ్చుంటున్నారు. అయితే, వీరిద్దరికీ కాకుండా దళితులకు అవకాశం ఇవ్వాలని భావిస్తే మాత్రం, మహబూబ్నగర్కు చెందిన దళిత నేత మల్లు రవికి అవకాశం రావచ్చునని అంటున్నారు.
ఈ ముగ్గురూ పార్టీకి, నాయకత్వానికి విధేయులే కావడం, సంస్థాగత స్థాయి నుంచే పైకి రావడం వచ్చినవారు. రెండుసార్లు పార్టీని వైయస్ రాజశేఖర రెడ్డితో కలిసి డీఎస్ అధికారంలోకి తీసుకు వచ్చారన్న సానుభూతి అధిష్ఠానంలో ఉంది. ప్రధానంగా పార్టీ అధి నేత్రి సోనియాగాంధీకి ఆయనపై విపరీతమైన సానుభూతి ఉంది. అయితే రాహుల్ గాంధీ మాత్రం డీఎస్పై విముఖతతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ప్రస్తుత పరిస్థితిలో డీఎస్ వేగంగా పనిచేయలేరన్న అభిప్రాయంతో ఉన్నట్లు చెబుతున్నారు. డిఎస్ తాజాగా పార్టీ అధినేత్రి సోనియాను కలిసి, తనకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే పనిచేస్తానని చెప్పినట్లు సమాచారం.
జోడు పదవులు నిర్వహిస్తున్న బొత్స సత్యనారాయణ భవిష్యత్తు వారంలోగా తేలుతుందనే ప్రచారం సాగుతోంది. మంత్రి పదవిని వదులుకుంటారా, పిసిసి అధ్యక్ష పదవిని కాదనుకుంటారా అనేది తేలాల్సి ఉంది. అయితే, పిసిసి అధ్యక్ష పదవి నుంచి బొత్సను తప్పించడమే మంచిదనే అభిప్రాయంతో పార్టీ అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు.
డి శ్రీనివాస్ ఢిల్లీలో మకాం వేశారు. పార్టీ అధిష్టానానికి అత్యంత విధేయుడైన నాయకుడు ఆయన. రెండు సార్లు వైయస్తో కలిసి పార్టీని అధికారంలోకి తెచ్చిన పేరు ఆయనకు ఉంది. మూడోసారి పిసిసి అధ్యక్ష పదవి ఆయనకు దక్కుతుందా, లేదా చూడాలి.
మల్లు రవి తెలంగాణకు చెందిన ఎస్సీ నేత. ఆయన కూడా పార్టీకి విధేయుడు. తెలంగాణకు చెందిన ఎస్సీ నేతను పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా అధిష్టానంలో సాగుతున్నట్లు సమాచారం.
మంత్రి కన్నా లక్ష్మినారాయణ కూడా పిసిసి అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గాన్ని పార్టీకి మద్దతుగా కూడగట్టడానికి ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే సాధ్యమవుతుందని అధిష్టానం ఆలోచిస్తోంది. అయితే, జగన్ కేసు ఆయనకు ఆటంకంగా మారే అవకాశం ఉంది.
సీనియర్ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. కాపు సామాజికవర్గానికి చెందిన కన్నాకు పిసిసి అవకాశం ఇస్తే సీమాంధ్రలో బలంగా ఉన్న కాపు, బలిజ, ఒంటరి కులాలు పార్టీకి పూర్తి స్ధాయి మద్దతుదారుగా ఉంటారన్న అంచనా నాయకత్వంలో ఉంది. అయితే కన్నా పేరు కూడా జగన్ కేసులో ఉన్నందున, ఆయనకు అవకాశం రాదన్న భావన ఉంది.
తెలంగాణ కోటాలో దళిత నేత మల్లు రవి కూడా తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన చాలాకాలం నుంచీ ఢిల్లీలోనే తిష్ఠ వేసి, పిసిసి అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దళిత కోటా నుంచి అవకాశం ఇవ్వాలని భావిస్తే మాత్రం రవికే పగ్గాలిస్తారంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కూడా రవి పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.