ఛానళ్లలో 'నెంబర్ 1' ఢీ: బొత్స వర్సెస్ కిరణ్
ఇటీవల రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన జై ఆంధ్రప్రదేశ్ సభలో బొత్స పాల్గొనడాన్ని కిరణ్ తనకు అనుకూలంగా మార్చుకనే ప్రయత్నాలు తీవ్రంగా చేశారట. మాజీ మంత్రి శంకర రావు వ్యవహారాన్ని కిరణ్కు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు బొత్స వినియోగించుకునే ప్రయత్నాలు చేశారట. ఇందుకోసం వారిద్దరు వారి వారి అనుకూల ఛానళ్లలో ఒకరిపై మరొకరు వ్యతిరేక ప్రచారానికి తెరలేపారంటున్నారు.
ఐదారుగురు ఎమ్మెల్యేలు అటూ ఇటు అయితే కిరణ్ సర్కారు భవిష్యత్తే ప్రశ్నార్థకం కావడం ఖాయం. అలాంటిది ఏకంగా 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బొత్స బహిష్కృతులుగా ప్రకటించి మిగతా కలకలం సృష్టించారు. వారి పేర్లు బయటపెట్టకుండా మరింత ఉత్కంఠ రేకెత్తించారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది మైనారిటీ ప్రభుత్వమని ఆయన చెప్పకనే చెప్పినట్లుగా కనిపిస్తోంది. తన వ్యూహంలో భాగంగానే బొత్స ఇలా చేశారంటున్నారు. బొత్స ప్రకటనపై కిరణ్ వర్గం స్పందిస్తే ప్రతిగా బొత్స వర్గం కూడా ఎదురుదాడికి దిగింది.
మద్యం సిండికేట్ల వ్యవహారంలో బొత్సను లక్ష్యంగా చేసుకునే ఎసిబి దాడులు జరిగాయని అప్పట్లో ప్రచారం జోరుగా సాగింది. ఆ సమయంలో కిరణ్, బొత్స ఉప్పూ నిప్పులా మారి అధిష్ఠానానికి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారంటూ బహిరంగంగా చర్చలు చోటు చేసుకున్నాయి. ఇటీవల ఈ వివాదాలు సద్దుమణిగి.. ఇద్దరి మధ్య సఖ్యత పెరిగిందని పార్టీ నేతలు భావించారు. కానీ పరిస్థితి చూస్తే ఇప్పుడు అలా కనిపించడం లేదు.
ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నడుస్తోన్న చానల్లో బొత్సకు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయని అంటున్నారు. ఇటీవల ఒక పత్రికలో బొత్స, మంత్రి గంటా శ్రీనివాసరావు మధ్య వివాదం ముదిరిందంటూ కథనం వచ్చింది. ఈ కథనాన్ని ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న చానల్లో పదే పదే చూపించారంటూ బొత్స వర్గీయులు మండిపడుతున్నారు. బొత్స ఆధ్వర్యంలో నడుస్తోన్న చానల్ పార్టీ బలోపేతానికి అవసరమయ్యే కార్యక్రమాలను ప్రసారం చేస్తుండగా సిఎం చానల్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు.