దాల్మియా: శ్రీలక్ష్మి మెడపై జగన్ కేసు కత్తి
ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే సిబిఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరారు. దీన్ని ఇంకా కేంద్రానికి పంపాల్సి ఉందట. శ్రీలక్ష్మితో పాటు గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్నూ దాల్మియా సిమెంట్స్ కేసులో సిబిఐ అధికారులు ప్రాసిక్యూట్ చేయనున్నారు. ఆయన పదవీ విరమణ చేసినందున ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. అయితే రాజగోపాల్ను ప్రాసిక్యూట్ చేయనున్న విషయాన్ని సిబిఐ అధికారులు ప్రభుత్వానికి తెలిపారు.
శ్రీలక్ష్మి, రాజగోపాల్తో పాటు గనుల శాఖలో మరికొందరు అధికారుల పైనా చర్యలకు సిబిఐ సిఫారసు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఒక పథకం ప్రకారం కడప జిల్లాలోని ఈశ్వర్ సిమెంట్స్కు చెందిన 1017 ఎకరాల సున్నపురాయి నిక్షేపాల లీజును దాల్మియా సిమెంట్స్కు బదలాయించారు. ఈ వ్యవహారంలో అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, కార్యదర్శి శ్రీలక్ష్మి, అప్పటి డైరెక్టర్ రాజగోపాల్ పూర్తిగా సహకరించారని సిబిఐ నిర్ధారించినట్లుగా తెలుస్తోంది.
ఈ కారణంగానే చార్జిషీట్లో సిబిఐ.. అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేరును కూడా చేర్చిన విషయం తెలిసిందే. భారీ పరిమాణంతో కూడిన లీజు దక్కించుకున్న దాల్మియా సిమెంట్స్ జగన్కు చెందిన భారతి సిమెంట్స్లో రూ.95 కోట్ల మేర పెట్టుబడి పెట్టింది. లీజుల బదలాయింపు ద్వారానే జగన్ ఈ పెట్టుబడులు పొందారని, దీనికి అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డితో పాటు శ్రీలక్ష్మి, రాజగోపాల్ ఉద్దేశపూర్వకంగానే సహకరించారని సిబిఐ అభియోగం మోపింది. దీంతో శ్రీలక్ష్మి, రాజగోపాల్ ప్రాసిక్యూషన్కు నిర్ణయం తీసుకున్నారు.