కాకరేపుతున్న తేనెతుట్టే: మోడీ వర్సెస్ కాంగ్రెస్
ఐక్యతను సూచించే ఉపమాలంకారం స్వయం ప్రకటిత యుద్ధోన్మాదులకు అర్థం కాదని కేంద్రమంత్రి మనీశ్ తివారీ ఎద్దేవా చేశారు. శక్తికి ప్రతీక అయిన దేవి అవతరాల్లో భ్రమరి (తేనెటీగ) ఒకటనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భ్రమరి దేవికి ఉత్తరాఖండ్లో దేవాలయం కూడా ఉన్నదని చెప్పుకొచ్చారు. మతాన్ని రాజకీయాలకు వాడుకోవడం తప్ప భారతీయ ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకునేందుకు మాత్రం వారికి సమయం దొరకడం లేదని ట్విట్టర్లో ఎద్దేవా చేశారు.
దేశభక్తి గురించి బిజెపి నేతల వద్ద పాఠాలు చెప్పించుకోవాల్సిన కర్మ తమకు పట్టలేదని మరో కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. మోడీ భారత మాత గురించి మాట్లాడుతున్నారు కానీ, ఒక్క బిజెపి నాయకుడు కూడా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదన్నారు. దేశం కోసం తండ్రిని, నానమ్మలను కోల్పోయిన రాహుల్ వంటి నేతకు మోడీ నీతులు చెబుతారా అన్నారు.
మోడీ ఒక విచ్ఛిన్న వాది అని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ విమర్శించారు. రాహుల్ పూర్తి లౌకికవాది కాగా, మోడీ పూర్తిగా మతోన్మాది అని ధ్వజమెత్తారు. మరోవైపు కాంగ్రెస్పై దాడిని నరేంద్ర మోడీ కూడా పెంచేశారు. 2014 ఎన్నికలతో దేశానికి కాంగ్రెస్ నుంచి విముక్తి లభిస్తుందని వ్యాఖ్యానించారు. పక్కాగా బిజెపియే గెలుస్తుందన్న ఆయన తన అభ్యర్థిత్వంపై మాత్రం మౌనం దాల్చారు. వారసత్వ పాలన ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు.
కాగా, విజయవంతమైన 'మన్మోహన్-సోనియా' నమూనాను ఇకముందూ కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. రెండు అధికార కేంద్రాలపై జరుగుతున్న చర్చ మీడియా సృష్టి అని ఏఐసిసి ప్రతినిధి జనార్దన్ ద్వివేది విమర్శించారు. రేపటి విషయం ఎలా ఉన్నా ఇప్పటికి ప్రధాని మన్మోహనే తమ నేత అని పేర్కొన్నారు. ప్రధాని మన్మోహన్ గాంధీజీ మూడు కోతుల్లో ఒకరని బిజెపి మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ఆ మూడింటిలో మూగ కోతి మన్మోహన్ అని ఎద్దేవాచేశారు. న్యాయవ్యవస్థ (గుడ్డి), యూపిఏ ప్రభుత్వం(చెవిటి)లు మిగతా రెండు కోతులని చెప్పుకొచ్చారు.